
విశ్వరూప్ను కలిసిన జగ్గిరెడ్డి
కొత్తపేట: వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి శక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, సత్కరించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ లు అమలు చేయకుండా దగా చేయడం, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడటం, ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు.
కులగణనకు శ్రీకారం
చుట్టింది జగన్ మాత్రమే
అమలాపురం టౌన్: గతంలో కులగణనకు శ్రీకారం చుట్టిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. స్థానిక హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన సమగ్ర కుల గణన సర్వేకు కమిటీ వేసింది అప్పటి సీఎం వైఎస్ జగనేనని గుర్తు చేశారు. కులగణనను వైఎస్సార్ సీపీ స్వాగతిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహణకు రూ.575 కోట్ల కేటాయింపులు ఏ మూలకు సరిపోతాయని ఎమ్మెల్సీ పెదవి విరిచారు. రూ.లక్ష కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 75 సంవత్సరాల చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి జగన్ 60 కార్పొరేషన్లను బీసీలకు ఏర్పాటు చేశారని, సంచార జాతులతో సహ సామాజిక న్యాయం చేశారని గుర్తు చేశారు. కులగణనతో బీసీలకు, సంచార జాతులకు రాజ్యాంగబద్ధంగా న్యాయం జరుగుతుందని సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. సమావేశంలో బీసీ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి త్రినాథ్, దండుమేను రూపేష్, ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
6న రాజోలులో మెగా జాబ్ మేళా
అమలాపురం రూరల్: వికాస సంస్థ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, రాజోలు ఏ1 సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. మేళా వాల్పోస్టర్ను కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ మేళాలో 1,547 పోస్టుల భర్తీకి సుమారు 37 కంపెనీలు పాల్గొంటున్నాయని, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని వివరించారు. వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ మాట్లాడుతూ, పదో తరగతి నుంచి పీజీ వరకూ విద్యార్హత కలిగిన 35 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరిశేషు పాల్గొన్నారు.
1.74 లక్షల మందికి ‘ఉపాధి’
రాయవరం: గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1.74 లక్షల మందికి పని కల్పించామని ఉపాధి హామీ పథకం ఏఓ ఐ.స్వరూప్ తెలిపారు. పసలపూడి, నదురుబాద గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా జిల్లాలోని 385 పంచాయతీల పరిధిలో వివిధ పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 57 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 56.80 లక్షలు సాధించామని చెప్పారు. రోజువారీ సగటు వేతనం రూ.291.20 చెల్లించామన్నారు. మొత్తం 12,045 కుటుంబాలు 100 రోజుల పని కల్పించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 9,653 కాలువల్లో 7,400 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేపట్టి, రూ.132 కోట్ల వేతనాలు చెల్లించామని వివరించారు. అలాగే 56 చెరువుల పూడికతీత, పునరుద్ధరణ పనుల ద్వారా రూ.3 కోట్ల మేర వేతనాలు చెల్లించామన్నారు. కొబ్బరి తోటల్లో 2,707 ఎకరాల్లో రింగ్ ట్రెంచెస్ పనులు చేపట్టడం ద్వారా రూ.16 కోట్ల వేతనాలు చెల్లించామన్నారు. మొత్తంగా జిల్లాలో గడచిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు వేతనాలుగా రూ.165.43 కోట్లు చెల్లించామని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా మే, జూన్ నెలల్లో 3,415 కిలోమీటర్ల మేర కాలువల్లోను, 59 చెరువుల్లోను పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ రెండు నెలల్లో 41 లక్షల పనిదినాలు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని స్వరూప్ తెలిపారు.

విశ్వరూప్ను కలిసిన జగ్గిరెడ్డి