పర్యాటకాభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకాభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం

May 3 2025 7:48 AM | Updated on May 3 2025 7:48 AM

పర్యాటకాభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం

పర్యాటకాభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం

అమలాపురం రూరల్‌: జిల్లాలో ఆలయ, బీచ్‌ పర్యాటక రంగ అభివృద్ధి, నిర్వహణకు వివిధ రిసార్ట్స్‌, హోటల్‌, రెస్టారెంట్‌ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. కాకినాడకు చెందిన అగామి ఫుడ్స్‌, హైదరాబాద్‌కు చెందిన హోటల్స్‌, రిసార్ట్స్‌ ఏఆర్‌ఆర్‌బీఐ గ్రూప్‌ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో.. జిల్లా పర్యాటకాధికారి వెంకటాచలం పర్యాటక రంగ అభివృద్ధి అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్వదేశీ దర్శన్‌ స్కీమ్‌లో వైనతేయ నదికి దగ్గరగా పాసర్లపూడి, ఆదుర్రు (బౌద్ధ స్తూపం), సముద్ర ముఖ ద్వారం వద్ద రిసార్ట్స్‌, రెస్టారెంట్లు, బోటింగ్‌ వంటి అవకాశాలున్నాయని తెలిపారు. ఎస్‌.యానాం సముద్ర తీరంలో రిసార్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ వంటి వాటికి మూడెకరాల భూములున్నాయన్నారు. కోటిపల్లి వద్ద గోదావరి తీరంలో ఇప్పటికే ఉన్న రిసార్ట్స్‌ను వినియోగంలో తెచ్చేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. వీటిపై ఆయా సంస్థల ప్రతినిధులు అధ్యయనం చేసి, అభివృద్ధికి యోచన చేయాలని సూచించారు. ద్రాక్షారామ, కోటిపల్లి. అంతర్వేది, ర్యాలి, వాడపల్లి వంటి 20 పెద్ద దేవాలయాలతో పాటు 17 బీచ్‌లను సందర్శించేలా ఆలయ, బీచ్‌ సర్క్యూట్‌ టూరిజానికి అవకాశాలున్నాయని వివరించారు. ఆత్రేయపురం మండలం పేరవరంలో పిచ్చుకలంక, చింతలమోరి బీచ్‌, లొల్ల లాకుల పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయన్నారు. తీర ప్రాంతం వెంబడి టీవీ సీరియల్స్‌, సినిమాల చిత్రీకరణ జరుగుతోందన్నారు. వారికి సంప్రదాయకంగా రిసార్ట్స్‌, హోటల్స్‌, స్టే హోమ్స్‌ నిర్మిస్తే మరింత అభివృద్ధికి అవకాశాలు వస్తాయని కలెక్టర్‌ చెప్పారు. సమావేశం అనంతరం పర్యాటక అధికారులతో కలసి ఆయా సంస్థల ప్రతినిధులు బీచ్‌, ఆలయాల సందర్శనకు వెళ్లారు. సమావేశంలో జిల్లా పర్యాటక ప్రాంతీయ సంచాలకులు సీహెచ్‌ పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement