
14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
● రోజుకో వినూత్న కార్యక్రమం
● గ్రంథాలయాల పాత్ర, సేవలపై మననం
అమలాపురం టౌన్: సమాజంలో గ్రంథాలయాల పాత్ర, సేవలను మననం చేసుకునేందుకు ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 14 నుంచి జిల్లాలో వారోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. జిల్లాల పున ర్వివిభజన జరిగినప్పటికీ కొన్ని శాఖలు ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలోనే ఉండిపోయాయి. అందులో గ్రంథాలయ శాఖ ఒకటి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక జిల్లా స్థాయి గ్రంథాలయం, 8 ప్రథమ శ్రేణి, 10 ద్వితీయ శ్రేణి, 86 తృతీయ శ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లాలో 51 గ్రామీణ గ్రంథాలయాలు, 161 బుక్ డిపాజిట్ సెంటర్లు, 5 మొబైల్ లైబ్రరీలు ఉన్నాయి. వీటన్నింట్లో ఈ నెల 24 నుంచి 20వ తేదీ వరకూ రోజుకో వినూత్న కార్యక్రమాలతో వారోత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజు అంటే 14న బాలల దినోత్సవం, దేశ మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో ఏటా వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో జిల్లాలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వీటి నిర్వహణకు కూడా ఆ గ్రంథాలయాధికారి జీవీఆర్ఎస్హెచ్కే వర్మ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 14న గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం అవుతాయి. గ్రంథాలయ పతాకాల ఆవిష్కరణలు, బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. 15న గ్రంథాలయాల్లో పుస్తక ప్రదర్శనలు, 16న గ్రంథాలయ ఉద్యమకారుల చరిత్రలపై అధ్యయనం, ఉద్యమకారుల గురించి వక్తల ప్రసంగాలు, 17న కవి సమ్మేళనాలు, 18న గ్రంథాలయాల స్ఫూర్తిని నింపే దిశగా విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు, 19న మహిళా దినోత్సవ వేడుకలు, మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు, 20న వారోత్సవాల ముగింపు సభలు, వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవాలు జరుగుతాయి.