
శ్రీకామాక్షీ దేవి చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీగా వాణి
అమలాపురం టౌన్: స్థానిక శ్రీ కామాక్షీ పీఠ మహా సంస్థానం, శ్రీ కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ ట్రస్టీ, పీఠాధిపతి కామేశ మహర్షి శివైక్యం చెందడంతో కొత్త ట్రస్టీ ఎంపిక పీఠంలో గురువారం జరిగింది. ఇప్పటి వరకూ మేనేజింగ్ ట్రస్టీ, సభ్యునిగా కామేశ మహర్షే విధులు నిర్వర్తించే వారు. ఆయన స్థానంలో పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమ మందిరం అమ్మ, కామేశ మహర్షికి వరుసకు సోదరి అయిన వక్కలంక వాణి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, సభ్యునిగా పీఠం ఉత్తరాధికారి విఘనస రాఖీ ప్రేమ్ ఎన్నికయ్యారు. గతంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుగా పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, న్యాయవాది వీరా నాగేశ్వరరావు, మట్టపర్తి నాగేశ్వరరావు ఉండేవారు. ఇప్పుడు కూడా వారు మరోసారి ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదుగురితో కూడిన చారిటబుల్ ట్రస్ట్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. పీఠాధిపతి శివైక్యం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పీఠానికి ఎన్నటికీ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. వాణి, రాఖీ ప్రేమ్ పేర్లను అప్పటికే ఉన్న ముగ్గురు ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పీఠాధిపతి కామేశ మహర్షి దివ్యాశీస్సులతో పీఠం కార్యకలాపాలు, చారిటబుల్ ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగించేలా నూతన మేనేజింగ్ ట్రస్ట్ తీర్మానించింది. ప్రేమ మందిరంలో పెరిగే అనాథ బాల బాలికల సంరక్షణ బాధ్యత ఎప్పటిలాగే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రస్ట్ న్యాయ సలహాదారు, సభ్యుడు వీరా నాగేశ్వరరావు మాట్లాడుతూ పీఠాన్ని, ట్రస్ట్ను అధ్యాత్మికంగా, సేవాపరంగా నిర్వహించేందుకు ఎప్పటిలానే భక్తులు, దాతలు సహకరించాలని కోరారు.