తడబడితూ.. | - | Sakshi
Sakshi News home page

తడబడితూ..

Jun 12 2025 3:51 AM | Updated on Jun 12 2025 3:51 AM

తడబడి

తడబడితూ..

సాక్షి, అమలాపురం: వేసవి సెలవులు పూర్తయ్యాయి. మళ్లీ బడికి వేళయింది. ఓ వైపు ప్రైవేట్‌ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులను రారా రమ్మని స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు సర్కారు బడులు ఇంకా సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నుంచి 2025–26 విద్యా సంవత్సరం బడి గంటలు మోగనున్నాయి. విద్యార్థుల ఉరుకులు పరుగులు..కేరింతలు మొదలవనున్నాయి.

నేటి నుంచి సందడి

ప్రతి ఉదయం విద్యార్థులు ఓ పక్క, వారి తల్లిదండ్రులు మరోపక్క ఉరుకులు, పరుగులు పెట్టనున్నారు. అటెన్షన్‌ ప్లీజ్‌..ౖసైలెన్స్‌ ప్లీజ్‌ అంటూ టీచర్ల పని ప్రారంభం కానుంది. ఇక విద్యార్థులకు స్వాగతం పలికేందుకు అటు సర్కారు..ఇటు కార్పొరేట్‌ పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకర్షించేందుకు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అయితే ఎంత మేర అడ్మిషన్లు వస్తాయన్నది వేచి చూడాలి.

ప్రహసనంగా బదిలీలు

పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గత నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి పూర్తి కాలేదు. బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యకం చేశాయి. ఎస్‌జీటీలకు మాన్యువల్‌ విధానంలో బదిలీలు కొనసాగిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం, తిరిగి వెబ్‌ కౌన్సెలింగ్‌ చేపడతామని చెప్పడంతో వివాదం ప్రారంభమైంది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేయగా, ప్రభుత్వం దిగి వచ్చి తిరిగి మాన్యువల్‌ కౌన్సిలింగ్‌కు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ కారణంగా బదిలీల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే గురువారంకూడా బదిలీల ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం.

పూర్తి స్థాయిలో చేరుకోని విద్యామిత్ర కిట్లు

పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, షూస్‌, రెండు జతల సాక్సులు, యూనిఫామ్‌, బెల్టులు, డిక్షనరీలతో కూడిన కిట్‌ను అందజేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థి చేతికి కిట్‌ అందివ్వగా నేడు ఆ పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో 91,078 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాకు షూస్‌, సాక్సులు, యూనిఫామ్‌ చేరుకోలేదు. దీంతో పాఠశాలల ప్రారంభం రోజు పూర్తి స్థాయిలో విద్యార్థులకు కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు మాత్రమే అందజేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పూర్తి కాని మనబడి–మన భవిష్యత్తు పనులు

పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి పూర్తి కావాల్సిన మనబడి – మన భవిష్యత్తు రెండవ దశ పనులు పూర్తి కాలేదు. మనబడి – మన భవిష్యత్తు రెండవ దశలో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, తాగునీటి సరఫరా, భవనాల మరమ్మతులు చేయాల్సి ఉంది. రెండవ దశ పనుల్లో భాగంగా 772 పాఠశాలలను రూ.257 కోట్లతో అభివద్ధి చేయాల్సి ఉండగా, చాలాచోట్ల సిమెంట్‌, ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాయి.

తల్లికి వందనం ఏదీ?

గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏటా రూ.15వేలు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం పథకం పేరును తల్లికి వందనంగా మార్పు చేసింది. ఏడాది గడిచినా తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేయలేదు. పాఠశాలల పునఃప్రారంభం రోజున తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పినా రెండేళ్ల సొమ్ము ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు.

నేటి నుంచి నూతన

విద్యా సంవత్సరం ప్రారంభం

పునఃప్రారంభానికి ముస్తాబైన

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు

పూర్తి కాని ఉపాధ్యాయ బదిలీలు

పూర్తి స్థాయిలో చేరని స్టూడెంట్‌ కిట్స్‌

జిల్లాలో 1,576 ప్రభుత్వ,

451 ప్రైవేట్‌ పాఠశాలలు

ప్రారంభానికి ఏర్పాట్లు చేశాం

వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం అందించనున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో విద్యార్థుల అడ్మిషన్స్‌ పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

– డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈవో, అమలాపురం

తడబడితూ..1
1/1

తడబడితూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement