విద్యార్థులకు కిట్‌కట | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కిట్‌కట

Jun 13 2025 4:47 AM | Updated on Jun 13 2025 4:47 AM

విద్య

విద్యార్థులకు కిట్‌కట

● ప్రచారార్భాటానబడి

సాక్షి, అమలాపురం: బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో తొలి రోజే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) కిట్లు అందజేశారంటూ విద్యా శాఖా మంత్రి లోకేష్‌ను భజన బృందం సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది. కానీ, అనేక ప్రభుత్వ బడుల్లో అనేక మంది విద్యార్థులు బూట్లు రాలేదని, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దిన నాడు – నేడు పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేయగా.. తల్లికి వందనం సొమ్మును ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టింది. ఇప్పుడు దానిలో కూడా కోత పెడుతోంది. ఇక విద్యార్థులకు అందజేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్‌లలో ప్రస్తుతానికి యూనిఫాం, బూట్ల పంపిణీకి కోత పెట్టింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్‌లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

90,981 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 90,981 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరికి సమగ్ర శిక్షా ద్వారా మూడు జతల యూనిఫాం, నోట్‌ బుక్స్‌, పాఠ్య పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్‌, ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువ చేసే కిట్‌లను ప్రభుత్వం అందించాల్సి ఉంది. జిల్లాలోని 90,981 మంది విద్యార్థుల కోసం 4,05,312 పాఠ్య పుస్తకాలు, 77,697 వర్క్‌బుక్స్‌, 7,936 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, 6,112 పిక్టోరియల్‌ డిక్షనరీలు, 60,390 బెల్టులు, 90,981 బ్యాగ్స్‌ను ఆయా మండల కేంద్రాలకు చేర్చారు. కానీ, తొలి రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, డిక్షనరీలు మాత్రమే ప్రధానోపాధ్యాయులు అందజేశారు. ఇప్పటి వరకూ యూనిఫాం, షూస్‌, సాక్సులు జిల్లాకు చేరుకోలేదు. వీటితో పాటు స్కూల్‌ బ్యాగ్స్‌ కూడా కలిపి అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీటన్నింటి పంపిణీని నిలిపివేశారు.

పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు

ప్రారంభమైన పాఠశాలలు

పూర్తి స్థాయిలో చేరని విద్యార్థి మిత్ర కిట్లు

నేటికీ జిల్లాకు చేరని యూనిఫాం,

షూస్‌, సాక్సులు

తల్లికి వందనం వాయిదా

ఏడాది కాలంగా ఊరిస్తున్న తల్లికి వందనం జీఓను ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం విడుదల చేసింది. ఈ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమయ్యేది మాత్రం వచ్చే నెల 5న అని చావు కబురు చల్లగా చెప్పింది. ప్రభుత్వ వ్యవహారం చూస్తూంటే టీజర్‌ విడుదలైన నెలా రెండు నెలలకు సినిమా విడుదలైనట్టుందని సైటెర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక లబ్ధిదారుల విషయంలో కూడా భారీగా కోత పెడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ఇస్తామన్న రూ.15 వేలలో రూ.2 వేలకు కోత పెట్టనున్నారు. ఈ మొత్తాన్ని పాఠశాల మెయింటెనెన్స్‌కు ఇవ్వనున్నారు. ఇది తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేస్తోంది.

విద్యార్థులకు కిట్‌కట1
1/2

విద్యార్థులకు కిట్‌కట

విద్యార్థులకు కిట్‌కట2
2/2

విద్యార్థులకు కిట్‌కట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement