
మాటలు ఘనం.. చేతల్లో విఫలం
గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యా సంవత్సరం చివరి దశకు చేరినప్పటికీ కూడా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందని దుస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు. 2019 ఎన్నికల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింత ఆకర్షించే దిశగా జగనన్న విద్యా కానుక పేరిట వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభించిన రోజునే కిట్లు అందజేసేవారు. గతంలో ఇచ్చిన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లకు అదనంగా నోట్ బుక్స్, బెల్టు, బ్యాగ్, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు డిక్షనరీలు జత చేశారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అంతకు ముందు మాదిరిగా పాఠశాలలు తెరచిన రోజునే విద్యా కానుక కిట్లు అందజేసేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజునే ప్రతి విద్యార్థి చేతిలో ఈ కిట్లు పెడతామని గొప్పగా చెప్పింది. తీరా చూస్తే ఆ మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. విద్యార్థి మిత్ర కిట్లు తీసుకుందామని ఆశతో వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఆక్స్ఫర్డ్, లిఫ్కో డిక్షనరీలు మాత్రమే అందజేశారు. బ్యాగ్స్ ఇవ్వకపోవడంతో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు తీసుకుని వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.