
యువతకు తీరని ద్రోహం
● ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు ● కూటమి ప్రభుత్వంపై భూమన ఆగ్రహం ● యువత పోరును విజయవంతం చేయాలని పిలుపు
తిరుపతి మంగళం : అధికారంలోకి వస్తే ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తామంటూ మాయమాటలు చెప్పి యువతకు మొండిచెయ్యి చూపించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం విద్యార్థులకు అందించలేదని విమర్శించారు. దీంతో కళాశాలల యాజమాన్యాల వేధింపులతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సైతం అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలహీనపరచి అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులపై పెడుతున్న శ్రద్ధలో పావు వంతు కూడా యువత, ప్రజా సంక్షేమంపై చూపడం లేదని మండిపడ్డారు.
ఇది ఉద్యమ సమయం
కూటమి ప్రభుత్వం చేసిన మోసం, ద్రోహంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భూమన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యువత పోరుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తరలిరావాలని కోరారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అందరితో సమన్వయం చేసుకుంటూ తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ల వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని సూచించారు.
అనంతరం యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు. అబద్ధపు హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వానికి హడలు పుట్టేలా భారీ సంఖ్యలో యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు.