
ఎంటీఎస్ టీచర్లపై కుట్ర
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) టీచర్ల బదిలీల ప్రక్రియలో ఖాళీలన్నీ చూపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభించారు. ఆ రెండు డీఎస్సీల టీచర్లకు టీడీపీ ప్రభుత్వం పాలనలో అన్యాయం జరిగితే గత వైఎస్సార్సీపీ సర్కారు మేలు జరిగేలా చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ టీచర్గా పనిచేయాలని కలలు కన్న ఆ టీచర్ల కోరికను వైఎస్సార్సీపీ సర్కారు నెరవేర్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లపై కక్ష సాధింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.
ఖాళీలు బ్లాక్ చేసి..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్ల బదిలీల్లో కుట్రకు పాల్పడేందుకు ప్రయత్నించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీలన్నీ చూపించకుండా తక్కువ ఖాళీలను చూపించి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎంటీఎస్ టీచర్లు తమకు అన్యాయం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యాశాఖ అధికారులకు హెచ్చరించారు. దీంతో ఆదివారం ఉదయం నిర్వహించాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3.15 గంటల వరకు ప్రారంభం కాని దుస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల నుంచి హాజరైన ఎంటీఎస్ టీచర్లు పడిగాపులు కాశారు.
మొదటి విడత కౌన్సెలింగ్
ఎంటీఎస్ టీచర్ల డిమాండ్లను పరిశీలించిన జిల్లా వి ద్యాశాఖ అధికారులు సమస్యలను ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించిన తర్వాత 3.15 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షించారు. వైఎస్సార్ 98 డీఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు స్వామి కణ్ణన్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్రెడ్డి, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు ఎంటీఎస్ టీచర్ల సమస్యలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 పోస్టులకు మొదటి విడతగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 369 పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 1664 పోస్టులను ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్లో చూపించారు. ఇందులో 549 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జిల్లాలో 1115 టీచర్ల పోస్టులు మిగులు ఉంటాయి. ఆ పోస్టులను ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.