
మామిడి రైతులను ఆదుకోవాలి
గంగాధర నెల్లూరు : మామిడి రైతుల కన్నీళ్లు చూస్తుంటే కడుపు కాలిపోతోందని రైతు ఉద్యమ నేత ఈదర వెంకటాచలం నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు పూత్తూరు మార్గంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మామిడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతుల పడుతున్న కష్టాలను గమనిస్తున్నామన్నారు. ఏడాది పొడువునా కన్న బిడ్డల్లా మామిడి పంటను సాగు చేస్తే నేడు గిట్టుబాటు ధర లేక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. కుటుంబాన్ని వదిలి వారాల పొడవున ఫ్యాక్టరీ గేట్లు ఎదుట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో తిండి నిద్రలేక రోడ్లపై రైతులు అగచాట్లు పడుతున్నా ఆదుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మామిడికి కనీసం మద్దతు ధర 50 రూపాయలు ఇచ్చి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు.