
మామిడి రైతుకు అండగా ఉంటాం
● రైతుల ఆందోళనపై తక్షణం ప్రభుత్వం స్పందించాలి ● కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలి ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని సోమవారం పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులు కన్నీరు పెడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరించడం లేదని మండిపడ్డారు. రైతుల గోడుపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా మామిడి కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయించాలని, లేకుంటే వైఎస్సార్సీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. మామిడి రైతుకు న్యాయ జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే..
● మామిడికి కనీస గిట్టుబాటు ధర కూడా దక్కకడం లేదు. ఫ్యాక్టరీలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
● మామిడి రైతులు తమ పంటలను ట్రాక్టర్లో తీసుకువచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, పొ రుగు రాష్ట్రాల మామిడి నేరుగా ఫ్యాక్టరీల్లోకి వెళ్లి పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? సరిహద్దుల్లో చెక్పోస్టు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో మామిడి ఎలా వస్తోంది. ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి నేతలు కుమ్మకై ్క రైతులను నాశనం చేస్తున్నారు.
● తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ మామిడి రైతులు రోడ్డెక్కారు. జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు.
● గుజ్జు ఫ్యాక్టరీలు కాయల కొనుగోలుకు టోకెన్ విధానం తీసుకువచ్చాయి. ఈ టోకెన్ల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నాయి. మిగిలినవి కూటమి నేతలు చెప్పిన వారికే గంపగుత్తగా ఇచ్చేస్తున్నాయి.
● ప్రభుత్వం సైతం జిల్లా రైతులను దగా చేస్తోంది. కూటమి నేతల కోసం ఫ్యాక్టరీలకే కొమ్ముకాస్తోంది. మామిడి కిలోకి రూ.12 గిట్టుబాటు అవుతుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీలు కేవలం రూ.6 మాత్రమే రైతులకు చెల్లిస్తున్నాయి.
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుజ్జు ఫ్యాక్టరీల వారు పంట కొనుగోలు చేసిన వారానికే రైతులకు నగదు అందించేవారు. ఇప్పుడు 3 నెలలకు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. కాదంటే సరుకు కొనం.. వెళ్లిపోండి అని తరిమేస్తున్నారు.
● గతంలో తోతాపురి రకం కోత సమయంలో పండు కాయలు తక్కువ ధరకు కొనేవారు. ఇప్పుడు చిన్న మచ్చ ఉన్నా గ్రేడింగ్లో పారేస్తున్నారు.
● మామిడి కొనుగోలు విషయంలో రైతుల గోడును కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో ధర పడిపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా కొనుగోలు చేయించింది.
● కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్పమామిడి రైతుల కష్టాలు కనిపించడంలేదు. మామిడి రైతులకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
● వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యాచరణతో రైతులకు అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం మెడలు వంచి, గిట్టుబాటు రేటుకు మామిడిని కొనుగోలు చేయించే వరకు పోరాటం కొనసాగిస్తుంది.
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఎక్కడైనా కిలో మామిడి రూ.8కు కొనుగోలు చేస్తున్నారా? నిరూపించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా? రైతులతో ఈ మాట చెప్పించగలరా? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.
తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. రైతుల ఆగ్రహం చూసిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించి చేతులు దులుపుకుంది. ప్రభు త్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక నిధి ఇస్తామని గొప్పగా ప్రకటించింది. అయితే ఎక్కడా అమలు జరగడం లేదు.
ఎకరా మామిడి సాగు చేయాలంటే కనీసం రూ.45వేలు ఖర్చవుతోంది. ఫ్యాక్టరీల వారు చిన్న మచ్చ ఉంటే కూడా కాయలు కొనడం లేదు. దీంతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

మామిడి రైతుకు అండగా ఉంటాం

మామిడి రైతుకు అండగా ఉంటాం

మామిడి రైతుకు అండగా ఉంటాం

మామిడి రైతుకు అండగా ఉంటాం