
‘పది’ంతల ఆనందం
● ముగిసిన పదో తరగతి పరీక్షలు ● రేపటి నుంచి పీసీఆర్ పాఠశాలలో మూల్యాంకనం ● 2,587 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 1వ తేదీతో ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 31వ తేదీతోనే పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ కావడంతో చివరి రోజు పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించారు. దీంతో మంగళవారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్ష ముగియడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చి ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ సందడి చేశారు. అనంతరం ఆనందంతో ఇంటిబాట పట్టారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. మొత్తం ‘పది’ పబ్లిక్ పరీక్షలకు 2,587 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా పరీక్షల్లో మార్చి 28 వ తేదీన వి.కోట బాలురు జెడ్పీ హైస్కూల్ లో ఒక విద్యార్థిని డీబార్ చేశారు.
రేపటి నుంచి పది మూల్యాంకనం
‘పది’ పరీక్షలు పూర్తి కావడంతో ఈనెల 3వ తేదీ నుంచి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేసినట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు.