రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..! | Why Do Indian Trains Have An X Mark On The Last Coach | Sakshi
Sakshi News home page

రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!

Oct 16 2025 7:53 PM | Updated on Oct 16 2025 8:30 PM

Why Do Indian Trains Have An X Mark On The Last Coach

దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.

ఇండియన్‌ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్‌పై ఉండే బోల్డ్ ‘ఎక్స్‌’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు  ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.

రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణ
చివరి కోచ్‌పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్‌లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపు
కొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్‌పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement