56 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్.. జోరుమీదున్న బుల్
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలు వేస్తోంది. వరుసగా నాలుగో వారం కూడా మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో సెన్సెక్స్ 56,000 పాయింట్లను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మిగిలిన రంగాల్లో సైతం లాభాలు నమోదు అవుతున్నాయి.
నిన్న సాయంత్రం 55,792 పాయింట్ల వద్ద క్లోజయిన బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం ఏకంగా 56,073 పాయింట్లతో మొదలైంది. ఉదయం 10:30 గంటల సమయంలో 292 పాయింట్లు లాభపడి 56,084 పాయింట్లతో కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. మార్కెట్ ప్రారంభమైన గంటకే 71 పాయింట్లు లాభపడి 16,685 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు రికార్డు స్థాయిలో 2.5 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత ఆల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, పవర్గ్రిడ్ షేర్లు ఉన్నాయి. నష్టాలు పొందిన వాటిలో ఇన్ఫోసిస్, టాటాస్టీల్, ఇండస్ఇండ్, ఇండియా వీఐఎక్స్ షేర్లు ఉన్నాయి.