దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పాపులర్ ఎస్యూవీ 'పాలిసేడ్' (2026 మోడల్) విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ (Stop-Sale) ఆదేశాలు జారీ చేసింది. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన సాంకేతిక లోపం వెలుగుచూడటంతో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.32 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
అసలేం జరిగింది?
నివేదికల ప్రకారం.. పాలిసేడ్ కారులోని మూడవ వరుస (3rd Row) పవర్ సీటు మధ్యలో చిక్కుకుపోవడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కార్లలో 'యాంటీ-పించ్' (Anti-Pinch) ఫీచర్ ఉంటుంది. సీటు ఫోల్డ్ అవుతున్నప్పుడు లేదా జరుగుతున్నప్పుడు ఏదైనా అడ్డంకి (వ్యక్తులు లేదా వస్తువులు) తగిలితే ఈ సెన్సార్ వెంటనే గుర్తించి ఆగిపోవాలి. అయితే, ఈ మోడల్లో ఆ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రభావితమైన వాహనాలు
హ్యుందాయ్ స్వచ్ఛందంగా చేపట్టిన ఈ రీకాల్ పరిధిలోకి 2026 హ్యుందాయ్ పాలిసేడ్ 'లిమిటెడ్', 'కాలిగ్రఫీ' ట్రిమ్స్ వస్తాయి. ఉత్తర అమెరికా, కెనడాలలో 68,500 వాహనాలు, ప్రపంచవ్యాప్తంగా 1,32,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది.
లోపం ఎక్కడ ఉంది?
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA)కు సమర్పించిన పత్రాల ప్రకారం.. రెండో, మూడో వరుస సీట్లను పవర్-ఫోల్డ్ చేసేటప్పుడు లేదా వన్-టచ్ టిల్ట్-అండ్-స్లైడ్ ఫీచర్ వాడుతున్నప్పుడు సెన్సార్లు ప్రయాణికులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు సీట్ల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ అంగీకరించింది.
కంపెనీపై ఆర్థిక ప్రభావం
ఈ రీకాల్ ప్రక్రియ కోసం హ్యుందాయ్ సుమారు 100 బిలియన్ వాన్లు (66.8 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. 2026లో హ్యుందాయ్ అంచనా వేసిన వార్షిక లాభం 12.9 ట్రిలియన్ వాన్లు. రీకాల్ ఖర్చు కంపెనీ లాభంలో కేవలం 0.8% మాత్రమే. కాబట్టి, కంపెనీ ఆర్థిక స్థితిపై లేదా షేర్ ధరపై దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
కాగా తమ కారు వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబానికి హ్యుందాయ్ సంస్థ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతకే తాము పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది.


