
యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యూఏఈ)తో భారత్ వాణిజ్యం వేగంగా పురోగమిస్తోందని లోక్సభలో ఇచ్చిన ఒక సమాధానంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య విలువ 60 బిలియన్ డాలర్లుకాగా, వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అన్నారు. రెండు దేశాల మధ్య ఫిబ్రవరి 18న జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం) ఇందుకు దోహదపడుతుందని వివరించారు.
విలువ పరంగా యూఏఈకి చేసే ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఉత్పత్తులకు.. ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి జీరో డ్యూటీ మార్కెట్ యాక్సెస్ భారత్కు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 11 విస్తృత సేవా రంగాల నుంచి దాదాపు 111 సబ్ సెక్టార్లలో భారతదేశానికి మార్కెట్ యాక్సెస్ లభించిందని తెలిపారు. కోల్ ఇండియా లిమిటెడ్ నుండి ఈశాన్య ప్రాంతంలోని తేయాకు తోటలకు బొగ్గు సరఫరా కొరత లేదని మరో ప్రశ్నకు ఆమె తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో మార్చి 9 వరకూ చూస్తే, బొగ్గు సరఫరాలు 16 శాతం పెరిగి, 618.70 మిలియన్ టన్నులకు చేరినట్లు వివరించారు.
(చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్న్యూస్.. కాప్జెమినీలో 60 వేల ఉద్యోగాలు..!)