
హెచ్డీబీ ఫైనాన్షియల్ మెగా ఇష్యూ
ఈ నెల 25 నుంచి 27 వరకు
రూ. 12,500 కోట్ల సమీకరణపై కన్ను
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇష్యూ ద్వారా ఎన్బీఎఫ్సీ మొత్తం రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది.
ప్రస్తుతం హెచ్డీబీ ఫైనాన్షియల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా బిజినెస్ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. అప్పర్ లేయర్లో ఉన్న ఎన్బీఎఫ్సీలు మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కావలసి ఉన్నట్లు 2022 అక్టోబర్లో ఆర్బీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కంపెనీ ఐపీవోకు వస్తోంది. కాగా.. గతేడాది ఇందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది.
కల్పతరు @ రూ. 387–414
ఈ నెల 24–26 మధ్య రియల్టీ కంపెనీ ఐపీవో
ముంబై, హైదరాబాద్, నోయిడాలో ప్రాజెక్టులు
రియల్టీ రంగ కంపెనీ కల్పతరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 387–414 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 1,590 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా విద్యుత్ ప్రసారం, పంపిణీ దిగ్గజం కల్పతరు గ్రూప్ కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది.
ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ విలువ రూ. 8,500 కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజన్(ఎంఎంఆర్)తో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ పుణే(మహారాష్ట్ర), హైదరాబాద్(తెలంగాణ), నోయిడా(ఉత్తరప్రదేశ్)లోనూ ప్రాజెక్టులు చేపడుతోంది. లగ్జరీ, ప్రీమియం, మధ్యాదాయ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 36 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఎలెన్బరీ @ రూ. 380–400
ఈ నెల 24–26 మధ్య పబ్లిక్ ఇష్యూ
రూ. 853 కోట్ల సమీకరణకు రెడీ
విభిన్న తరహా గ్యాస్ల తయారీ కంపెనీ ఎలెన్బరీ ఇండ్రస్టియల్ గ్యాసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 380–400 చొప్పున ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు దాదాపు రూ. 453 కోట్ల విలువైన 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 853 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 37 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఇష్యూ నిధులలో రూ. 210 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 105 కోట్లు పశి్చమబెంగాల్లోని ఉలుబేరియా–2 ప్లాంటులో సెపరేషన్ యూనిట్ ఏర్పాటుకు, మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ విభిన్న ఇండస్ట్రియల్ గ్యాస్ల తయారీ, సరఫరాలను చేపడుతోంది. డ్రై ఐస్, సింథటిక్ ఎయిర్, ఫైర్ఫైటింగ్ గ్యాస్, మెడికల్ ఆక్సిజన్, ఎల్పీజీ, వెల్డింగ్ మిక్సర్స్సహా పలు స్పెషాలిటీ గ్యాస్లను అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 312 కోట్లను అధిగమించగా.. నికర లాభం 84 శాతం జంప్చేసి రూ. 83 కోట్లను తాకింది.