టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ బ్రాండ్ల కారణంగా.. హ్యుందాయ్ తన పట్టును కోల్పోతూ, భారతీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తన రెండవ స్థానం నుంచి కిందికి జారిపోతోంది. ఈ కార్ల తయారీ సంస్థ తిరిగి పుంజుకోవడానికి సన్నద్ధమవుతూ.. కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడానికి ఒక ప్రణాళికను రూపొందించింది.
కంపెనీ క్యూ4 ఆదాయాల ప్రకటన సందర్భంగా.. 2027 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లో రెండు కొత్త ఎస్యూవీలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. వీటిలో టాటా పంచ్ ఈవీకి పోటీగా నిలుస్తుందని భావిస్తున్న ఇన్స్టర్ ఈవీ, బేయాన్ ఆధారిత క్రాస్ఓవర్ ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ & సీఈఓ తరుణ్ గార్గ్ ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో, రెండు పూర్తిగా కొత్త నేమ్ప్లేట్లను ప్రవేశపెట్టబోతున్నారు. వాటిలో ఒకటి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగం, మరొకటి ఐసీఈ ఎస్యూవీ విభాగంలో ఉండనున్నాయి. భారతదేశంలోని ప్యాసింజర్ వాహన విభాగంలో పెద్ద భాగాన్ని ఆక్రమించిన, అత్యధిక డిమాండ్ ఉన్న వాహన విభాగాలైన కాంపాక్ట్ SUV, మిడ్-సైజ్ SUVలలో ఈ రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు.


