మహీంద్రా షోరూంలో అవమానం.. ఇంటికే బొలెరో డోర్ డెలివరీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహీంద్రా ఆటోమొబైల్స్, కర్నాటక రైతు కెంపెగౌడల మధ్య వివాదం ఇప్పుడు సుఖాంతమైంది. మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానంపై ఆ కంపెనీ యాజమాన్యం స్పందించింది. కంపెనీ వాగ్దానం చేసినట్లుగా నేరుగా ఆయన ఇంటికే బొలెరో పికప్ ట్రక్కును తీసుకెళ్లి అధికారులు అందించారు. షోరూంలో పని చేసే సిబ్బంది, అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. రైతుకు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానం పట్ల తాము చింతిస్తున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తమ వాహనాన్ని స్వీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని రైతు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా.. "మహీంద్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఇతర సిబ్బంది నా ఇంటికి వచ్చి షోరూంలో జరిగిన దానికి క్షమాపణ లు చెప్పారు. వారు ఇచ్చిన మాటకు కట్టుబడి వాహనాన్ని సాయంత్రం నాటికి నాకు డెలివరీ చేశారు" అని పేర్కొన్నారు.
వెల్కమ్ టూ మహీంద్రా
2022 జనవరి 21న కెంపెగౌడకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తాజాగా ప్రకటించింది మహీంద్రా రైజ్. జరిగిన ఘటనపై తగు చర్యలు తీసుకున్నామని, సమస్య సమసిపోయిందని తెలిపింది. మహీంద్రా వాహనం కొనుగోలు చేయాలనుకున్నందుకు కెంపెగౌడకు కృతజ్ఞతలు తెలిపింది. వివాదం సమసిపోయినందున మహీంద్రా వాహనం కొనాలంటూ కెంపెగౌడని కోరుతూ ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కెంపెగౌడకి వెల్కమ్ చెప్పారు. అయితే ఇంతటి వివాదానికి కారణమైన సేల్స్మన్పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే అంశాలను మహీంద్రా గ్రూపు స్పష్టంగా ప్రకటించలేదు.
And let me add my welcome to Mr. Kempegowda…🙏🏽 https://t.co/BuKnTNov42
— anand mahindra (@anandmahindra) January 28, 2022
అసలు వివాదం
కెంపెగౌడ అనే రైతు కారు కొనేందుకు కర్నాటకలోనిన తుముకూరులో ఉన్న మహీంద్రా షోరూమ్కి వెళ్లగా.. నీకు కారు కొనే స్థోమత లేదంటూ సేల్స్మాన్ అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో గంట వ్యవధిలోనే రూ.10 లక్షలతో వచ్చిన సదరు రైతు ఇప్పటికిప్పుడు వాహానం డెలివరీ చేస్తారా? అంటూ సవాల్ విసిరాడు. డెలివరీ చేయలేమంటూ షోరూం సిబ్బంది చెప్పారు. మహీంద్రా వాహనం కొనాలని ఇక్కడకు వచ్చానని, కానీ తనకు జరిగిన అవమానంతో వేరే కంపెనీ వాహనం కొంటాను అంటూ వెళ్లిపోయాడు కెంపెగౌడ. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
(చదవండి: దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?)