పెట్టుబడికీ ‘ఓకే బంగారం’!

Gold: Best Ways to Invest in Gold - Sakshi

బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే లోహం ఇది. ఆభరణాలు, పెట్టుబడుల సాధనంగా డిమాండ్‌ అధికం. ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇక డిజిటల్‌ బంగారం సాధనాల్లో పెట్టుబడులు వేరే. బంగారం విలువైన లోహమే అయినప్పటికీ ధరల పరంగా ఇందులో అస్థిరతలు కూడా చాలా ఎక్కువ. ఈక్విటీ మార్కెట్లు అంత కాకపోయినా, గోల్డ్‌లోనూ ఆటుపోట్లు అధికమే. ఇక్కడ కూడా ఇన్వెస్టర్ల సహనమే రాబడులకు గీటురాయి అవుతుంది.

అసలు బంగారంలో పెట్టుబడి దండగ? అని కొందరు అంటుంటారు. పోర్ట్‌ఫోలియోలో కనీసం 5–10 శాతం అయినా బంగారానికి కేటాయించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈ భిన్నమైన అభిప్రాయాలు, సూచనలతో ఇన్వెస్టర్లకు అయోమయం ఏర్పడొచ్చు. నిజానికి బంగారంలో పెట్టుబడి వద్దు అని చెప్పడానికంటే.. ఇన్వెస్ట్‌ చేసుకోండని సూచించడానికే కారణాలు బోలెడు ఉన్నాయి. బంగారం ధరల తీరుతెన్నులు, దీర్ఘకాల చరిత్రను పరిశీలిస్తే ఇందులో పెట్టుబడి పెట్టే విషయమై ఎలా నడుచుకోవాలన్న అవగాహన ఏర్పడుతుంది. పెట్టుబడి సాధనంగా బంగారం ఎంపిక ముందు తెలుసుకోవాల్సిన అంశాలతో కూడిన కథనమే ఇది.

రాబడులు
1978 నుంచి 1985 వరకు బంగారం ధర ర్యాలీ చేసింది. మళ్లీ 1988 నుంచి 1992 వరకు పెరగడాన్ని చూడొచ్చు. తిరిగి 2002–2012 మధ్య కూడా బంగారం భారీ ర్యాలీ చేసింది. కానీ, మిగిలిన కాలాల్లో అక్కడక్కడే చలించింది. మొత్తానికి దీర్ఘకాలంలో రాబడులు ఇచ్చినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. విడిగా చూస్తే బంగారం నికర నష్టాలను ఇచ్చిన సంవత్సరాలు కూడా కనిపిస్తాయి. టేబుల్‌ను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. బంగారం ధర పెరగడమే కానీ, తగ్గదు? అన్నది నిజం కాదు. 1967 నుంచి 1974 మధ్య బంగారం ధర ఐదు రెట్లు పెరిగింది.

2004–2012 మధ్య కూడా ఐదు రెట్లు పెరిగింది. కానీ, మిగిలిన సంవత్సరాల్లో పెద్దగా పెరుగుదల లేదు. కనుక దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినప్పుడే ఈ పెరుగుదల ప్రయోజనం ఇన్వెస్టర్‌కు లభిస్తుంది. బంగారం నిర్ణీత కాలం పాటు అలా స్థిరంగా కొనసాగుతూ.. కేవలం రెండు, ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో రెట్లు పెరుగుతుందని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్‌ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థల పనితీరు, కరెన్సీ మారకం తదితర అంశాల ప్రభావం బంగారంపై ఉంటుంది. దీర్ఘకాలం పాటు, ఒక సైకిల్‌ నుంచి మరో సైకిల్‌ వరకు బంగారంలో పెట్టుబడిని కొనసాగించడం ద్వారా అస్థిరతల ప్రభావం లేని, చక్కని రాబడులు సొంతం చేసుకోవచ్చు.
రాబడి తీరు ఇదీ...
సంవత్సరం    సగటు రాబడి (శాతంలో)
ఏడాది    13.6
మూడేళ్లు    12.9
ఐదేళ్లు    12.4
పదేళ్లు    12.3

పెట్టుబడి మార్గాలు..
బంగారం ఆభరణాల రూపంలో కలిగి ఉండాలా? కాయిన్ల రూపంలోనా? లేక ఈటీఎఫ్‌లోనా? ఇలాంటి సందేహాలు రావచ్చు. సార్వభౌమ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు), గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్, ఈ గోల్డ్, 24 క్యారట్ల కాయిన్లు, బార్లు, ఆభరణాలు ఇన్ని రూపాల్లో బంగారాన్ని కలిగి ఉండే వెసులుబాటు ఉంది. వీటన్నింటిలోకి మెరుగైన మార్గాలు ఏవి అంటే ఎస్‌జీబీ, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అని చెప్పుకోవాల్సిందే. ఆభరణాల రూపంలో బంగారాన్ని కలిగి ఉండొచ్చు. కానీ, పెట్టుబడి మార్గంలో ఆభరణాలను కలిగి ఉండడం కంటే, డిజిటల్‌ రూపంలో నిర్వహించడమే మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. ముఖ్యంగా సార్వభౌమ బంగారం బాండ్లు అయితే ఎనిమిదేళ్ల కాలవ్యవధితో వస్తాయి. 

భౌతిక రూపంలోనే బంగారాన్ని కలిగి ఉండేట్టు అయితే.. ఆభరణాలుగా కాకుండా, బ్యాంకుల నుంచి 24 క్యారట్ల కాయిన్ల రూపంలో కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే బంగారం ఆభరణాలు అయితే, తయారీ చార్జీలు, తరుగు, వృథా పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. బంగారం కాయిన్లు సైతం రుణాలు పొందేందుకు సాయపడతాయి. ఇక ఆ తర్వాత గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అన్నవి స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్‌ అవుతుంటాయి. షేర్ల మాదిరే కొనుగోలు విక్రయాలు చేసుకోవచ్చు. దీనికి ట్రేడింగ్, కమ్‌ డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. మార్కెట్‌ ధర ఆధారంగానే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ధరల్లో మార్పు ఉంటుంది. ఇక పలు ఎన్‌బీఎఫ్‌సీలు, వ్యాలెట్లు ఆఫర్‌ చేసే ఈ–గోల్డ్‌ (ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌) అన్నది ఎంత మాత్రం మెరుగైన సాధనం కాదు. ఇందులో తెలియని చార్జీల రూపంలో, సరైన ధరల్లేమి కారణంగా కొంత నష్టపోవాల్సి వస్తుంది. గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కూడా అంతే. చార్జీల రూపంలో రాబడిలో కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. ఎస్‌జీబీల్లో ఏ చార్జీలు ఉండవు.  

పోర్ట్‌ఫోలియో వైవిధ్యం
పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట పెట్టొద్దన్నది ప్రాథమిక సూత్రం. ఈక్విటీలు, డెట్, బంగారం, ప్రాపర్టీ ఇలా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. ఒక్కో కాలంలో ఒక్కో సాధనం ప్రతికూలతలను చూస్తుంటుంది. ఈక్విటీలు నేలచూపులు చూస్తున్న సమయాల్లో బంగారం ర్యాలీ చేస్తుంటుంది. అస్థిరతలను అధిగమించేందుకు ఇదొక సాధనం. పైగా ఇది అత్యంత లిక్విడిటీ ఉన్న సాధనం. కనుక పెట్టుబడుల్లో బంగారానికి చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. రిస్క్‌ను తగ్గించి దీర్ఘకాలంలో విలువను పెంచేది కనుక దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి.
బంగారంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

పెట్టుబడికి ఢోకా లేదు
ఒక కంపెనీ షేరులో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఆ కంపెనీ వ్యాపారం దెబ్బతిని కుదేలైపోతే పెట్టుబడి కూడా హరించుకుపోతుంది. కానీ, బంగారంలో పెట్టుబడికి ఢోకా లేదు. 3,000 ఏళ్ల చరిత్రలో బంగారం విలువ కానీ, ధర కానీ సున్నా కాలేదు. అందుకే కష్టకాలంలో అసలైన ఆస్తులు ఏవంటే? బంగారం, భూమి అని చెబుతారు. పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉంటే, కష్టకాలం ఎదురైతే దీని సాయంతో గట్టెక్కొచ్చన్న భరోసా ఉంటుంది.  

అత్యవసరాల్లో ఆదుకుంటుంది..
బంగారం కష్టకాలంలో ఆదుకునే సాధనం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో, స్టాక్‌ మార్కెట్‌ పతనాల్లో సురక్షిత సాధనంగా పసిడివైపే చూస్తుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరం పడితే, బంగారం విక్రయించి గట్టెక్కొచ్చు. లేదంటే కనీసం ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందొచ్చు. రుణంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ప్రస్తుతం బంగారంపై బ్యాంకులు 8–9%రేటును వసూలు చేస్తున్నాయి.

లిక్విడ్‌ అసెట్‌
బంగారం కొనుగోలు, విక్రయం చాలా సులభం. అంటే ఇది లిక్విడ్‌ అసెట్‌ అవుతుంది. భూమి/ఇల్లు లిక్విడ్‌ అస్సెట్‌ కాదు. ప్రాపర్టీ అనేది కోరుకున్న వెంటనే, అవసరంలో వేగంగా అమ్ముడుపోయే సాధనం కాదు. మార్కెట్‌ కంటే తక్కువ ధరకు విక్రయిస్తే తప్ప ప్రాపర్టీల విక్రయానికి కొంత సమయం తీసుకుంటుంది. లావాదేవీ ముగిసి, చేతికి డబ్బు అందడానికి కనీసం మూడు నెలలు అయినా సమయం పడుతుంది.

ప్రత్యేక నైపుణ్యాలు అక్కర్లేదు
స్టాక్స్‌లో పెట్టుబడులకు మంచి పరిజ్ఞానం ఉండాలి. ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా కనీస పరిజ్ఞానం లేదా నిపుణుల సాయం కావాలి. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలంటే మార్కెట్‌ ధరల తీరు, భవిష్యత్‌ వృద్ధి అవకాశాల గురించి అవగాహన ఉండాలి. న్యాయ నిపుణుల సలహాలు కూడా అవసరం పడతాయి. క్రిప్టో కరెన్సీలు అయినా, బాండ్లు అయినా అవగాహనతో కొనుగోలు చేయాల్సిందే. కానీ, బంగారానికి ఇవేమీ అక్కర్లేదు.

ద్రవ్యోల్బణం నుంచి రక్షణ
బంగారాన్ని ద్రవ్యోల్బణానికి హెడ్జ్‌గా పరిగణిస్తుంటారు. ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో కరెన్సీ విలువలు క్షీణిస్తుంటాయి. గత దశాబ్ద కాలంలో డాలర్‌ మారకంలో రూపాయి తన విలువను రెట్టింపు మేర కోల్పోయింది. కానీ, బంగారం ధర గత ఐదేళ్లలో రెట్టింపైంది. గత దశాబ్దంలో నాలుగు రెట్లు పెరిగింది. వడ్డీ రేట్లను దాటుకుని ద్రవ్యోల్బణం పరుగులు తీస్తున్న తరుణంలో బంగారంలో పెట్టుబడితో భరోసా లభిస్తుంది. పదేళ్ల కాలంలో బంగారంలో వార్షిక సగటు రాబడులను గమనిస్తే రెండంకెల్లో ఉన్నట్టు ఇక్కడి టేబుల్‌ చూస్తే తెలుస్తుంది. అంటే ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు రాబడి బంగారంలో సాధ్యమేనని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top