నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.750 కోట్ల నిధులతో నూతనంగా గోదాంల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో గోదాంలను తనిఖీ చేసిన ఆయన రికార్డుల ఆధారంగా స్టాక్ను పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో 25 కేంద్రాల్లో 2.50.లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలకు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, హైదరాబాద్లో ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీల కోసం రూ.70 కోట్లతో 23 ఎకరాల్లో గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వెంకటాయపాలెంలో మిర్చి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. గోదాంలు అందుబాటులోకి వస్తే రైతులు పండించిన పంటల నిల్వలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని చెప్పారు. అయితే, రైతులు సంప్రదాయ పంటలకు బదులు పంట మార్పిడితో ప్రయోజనాలు పొందాలని సూచించారు. సదస్సులో డీఏఓ డి.పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, ఏడీఏ సతీష్ ప్రతినిధులు పాల్గొన్నారు.
●బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రులు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, అలా రాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, నల్లాని మల్లికార్జున్రావు, బొందయ్య, భద్రయ్య, కడియాల నరేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్
రాయల నాగేశ్వరరావు


