● భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ● తెల్లవారుజామున ఇసుక ర్యాంపుల పరిశీలన
బూర్గంపాడు: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట హెచ్చరించారు. గురువారం తెల్లవారు జామున సారపాక, పాత గొమ్మూరు వద్ద గోదావరి నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారిక ఇసుక ర్యాంపుల నుంచే మాత్రమే సరఫరా జరపాలన్నారు. సోంపల్లిలోని అధికారిక ఇసుక ర్యాంపులను కూడా తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, వే బిల్లులు లేకుండా జీరో దందా చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రాంతాల్లో కందకాలు తవ్వించాలని, వాహనాలు గోదావరిలోకి దిగకుండా కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంతంలో 24 గంటలు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిల్వచేసిన ఇసుకను సీజ్చేయాలని సూచించారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


