‘సీతారామ’ కాల్వకు మోక్షం
● నెలల తర్వాత సొరంగం తవ్వకం ప్రారంభం ● ఏకకాలంలో నీటి తొలగింపు, సొరంగం తవ్వకం
తిరుమలాయపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం నుండి పోచారం వరకు ఎనిమిది కి.మీ. మేర చేపట్టాల్సిన సొరంగ మార్గం పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో 4.1 కి.మీ. సొరంగ మార్గం తవ్వాక గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, భూగర్భ జలాలు ఉబికిరావడంతో దమ్మాయిగూడెంలో వద్ద టన్నెల్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గత ఏడాది అక్టోబర్లో దమ్మాయిగూడెం వద్ద టన్నెల్ను పరిశీలించారు. అయితే, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టు నిర్మాణ సంస్థ కొద్దినెలలుగా పనులను నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు రూ.32కోట్ల నిధులు విడుదల చేయడంతో కూసుమంచి మండలం పోచారం వైపు నుంచి సొరంగం తొలిచే పనులు మొదలుపెట్టారు. టన్నెల్లోని బండరాళ్లను బ్లాస్ట్ చేసేందుకు భారీ యంత్రాన్ని సమకూర్చుకున్నారు. ఇదే సమయాన టన్నెల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్లు కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే 4.1 కి.మీ. మేర సొరంగ మార్గం పూర్తి కాగా ఇంకా 3.9 కి.మీ. మేర నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు జల వనరుల శాఖ డీఈ బాణాల రమేష్రెడ్డి తెలిపారు.


