ఒకరి అరెస్ట్, పరారీలో మరొకరు..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో బుధవారం మధ్యా హ్నం 8.580 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ అరుణ్కుమార్ కథనం ప్రకారం.. బుధవారం మధ్యా హ్నం కూనవరం రోడ్డులో టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తూ బైక్పై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా ఆపారు. వారి వివరాలు అడుగుతుండగా ఒకరు పరారయ్యారు. మరో వ్యక్తిని తనిఖీ చేయగా బ్యాగులో 8.580 కేజీల గంజాయి దొరికింది. దాని విలువ రూ.4,29,000 ఉంటుందని, పట్టుబడిన వ్యక్తి భద్రాచలంలోని సుందరయ్యనగర్కాలనీకి చెందిన నాగేశ్వరరావుగా తేలిందని, అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని డీఎస్పీ అరుణ్కుమార్ వెల్లడించారు. పారిపోయిన వ్యక్తిని సుతారి మేస్త్రి మడకం ముత్తుగా గుర్తించామని, త్వరలో పట్టుకుంటామని ఆయన వివరించారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్, ఏఎస్ఐ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
ములకలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ మధుప్రసాద్ కథనంమేరకు.. గుండాలపాడు గ్రామపంచాయతీ చలమన్ననగర్కు చెందిన పర్సిక రాజుకు భార్యలు వీరమ్మ, రమాదేవి ఉన్నారు. వీరి మధ్య సఖ్యత లేక తరచూ గొడవలు కావడంతో గతంలోనే పలుమార్లు గ్రామపెద్దలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తనవల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని మనస్తాపానికి గురైన రమాదేవి(22) మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి ఎట్టి కన్నమ్మ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


