అశ్వారావుపేటరూరల్: దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. సీఐ పి.నాగరాజురెడ్డి వివరాలు వెల్లడించారు. బుధవారం మధ్యా హ్నం పట్టణంలోని పాపిడిగూడెం మార్గంలో ఎస్ఐ టి.యయాతిరాజు సిబ్బందితో వాహనాల తనిఖీ లు నిర్వహిస్తుండగా, సత్తుపల్లి వైపు అనుమానస్పదంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏపీ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం అంకంపాలేనికి చెందిన కట్టూరి సుందరబాబు, అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జక్కుల చిన్ని అలియాస్ నాగేశ్వరరావు, నరదల ప్రసాద్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పార్కింగ్ చేసి ఉండే ట్రాక్టర్ ట్రక్కులు, డబుల్ బ్లేడ్ డిస్క్ యంత్రాలు, ట్రాక్టర్ విడి భాగాలను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ చేసిన ట్రాక్టర్ ట్రక్కులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, అరెస్టయిన వారిలో నారాయణపురం గ్రామవాసి జక్కుల చిన్ని అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడం గమనార్హం.
నిందితుల నుంచి ట్రాక్టర్ ట్రక్కులు స్వాధీనం


