జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పెద్దతండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దతండాకు చెందిన ధరావత్ శంకర్–కాంతి దంపతులు తాటాకులతో కూడిన పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసెకు నిప్పంటుకోవడంతో వృద్ధాప్యం, అనా రోగ్యంతో బాధపడుతున్న శంకర్ మంచంపై పడుకోగా.. ఒకేసారి లేచి రాలేకపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈప్రమాదంలో పూరి గుడిసెతో పాటు ఇంట్లోని ఫ్రిజ్, ఇనుప బీరువా, టీవీ, ఫ్యాన్లు, డబుల్ కాట్, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.
వైరా ఎమ్మెల్యే భరోసా..
శంకర్ పూరిల్లు దగ్ధమైన విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను తెలుసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.
అమరారంలో గడ్డివాము..
పినపాక: అనుమానాస్పదంగా పది ఎకరాల గడ్డి వాము దగ్ధమైన ఘటన మండల పరిధిలోని అమరారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ ముజాఫర్ తన ఇంటి ఆవరణలో 10 ఎకరాల గడ్డిని ఉంచాడు. శనివారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో గడ్డివాముకు మంటలు వ్యాపించడాన్ని గమనించి ఫైర్ ఇంజన్కు సమాచారం అందించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో సుమారు రూ.50వేల నష్టం వాటిల్లిందని, కావాలనే ఎవరైనా నిప్పంటించారేమోనని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు తెలిపారు.
సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం


