స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రో క్తంగా జరిపారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాపారావు, రామిరెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి
శ్రీలంక సుప్రీం కోర్టు జడ్జి ఎస్.సురాజ్ రాజాజీ దంపతులు శుక్రవారం శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. జడ్జి దంపతులకు అర్చకులు స్వాగతం పలకగా, ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. కాగా న్యాయమూర్తి దంపతులు పాల్వంచ సమీపాన గుడిపాడులో పునర్నిర్మించిన శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం జరిగిన ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్ఠాపనకు హాజరయ్యారు. శుక్రవారం పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు.
పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం
చుంచుపల్లి: జిల్లాలోని పలువురు గ్రామపంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం కలిగింది. 317 జీఓ ద్వారా 2022లో భద్రాద్రి కొత్తగూడెం జోన్కు బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇతర జోన్ల నుంచి జిల్లాకు 28 మంది పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. తాజాగా 190 జీఓతో వెసులుబాటు కల్పించటంతో వారిలో 19 మందికి డిప్యూటేషన్ అవకాశం వచ్చింది. జిల్లాకు చెందిన 19 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం రిలీవ్ అయ్యారు. వీరందరూ కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో స్థానచలనం పొందారు. పలువురు పంచాయతీ కార్యదర్శులను పాలకవర్గాలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం


