డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల నమోదు
సూపర్బజార్(కొత్తగూడెం): డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) యాప్ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రబీలో సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 396 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో 291 గ్రామాలకు డిజిటల్ మ్యాప్లు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ మ్యాప్లు అందుబాటులో ఉన్న చోట వలంటీర్ల ద్వారా డీసీఎస్ యాప్ సహాయంతో పంటల నమోదు చేపడుతున్నారు. మొత్తం బుకింగ్కు అందుబాటులో ఉన్న ఫార్మ్ ఫీల్డ్లు 1,70,105 ఉన్నాయి. విస్తీర్ణం 2,27,714 ఎకరాలుగా ఉంది. డిజిటల్ క్రాప్ సర్వేకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో సాధారణ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తున్నారు. డిజిటల్ మ్యాప్లు లేని గ్రామాలు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, డిజిటల్ సంతకం చేయని ఫీల్డ్స్, భూరికార్డులు అందుబాటులో లేని ప్రాంతాల్లో సాధారణ క్రాప్ బుకింగ్ జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 291 మంది వలంటీర్లను క్రాప్ బుకింగ్ కోసం తాత్కాలిక పద్ధతిన వ్యవసాయ శాఖ నియమించింది. వలంటీర్లు తమకు కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఫీల్డ్ను ప్రత్యక్షంగా పరిశీలించి డిజిటల్ సర్వేను నిర్వహించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వలంటీర్ల ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైతులు తమ ప్రాంతాల్లో వలంటీర్లకు సహకరించి పంటల నమోదు చేయించుకోవాలి. వలంటీర్లకు ప్రతి ఫీల్డ్ క్యాప్చర్కు రూ.7 చొప్పున చెల్లిస్తాం.
–బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి


