
ఆధార్ అప్డేట్ తప్పనిసరి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విద్య, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేయాలని, ఐదేళ్లు, పదిహేనేళ్లు దాటిన వారు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, పాఠశాలల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఆధార్ నమోదు కేంద్రాలు, ఆధార్ కార్డులపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్లో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావును సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రీజియన్ యూఐడీ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ సౌరబ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.