
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
నేడు రుద్రహోమం
పెద్దమ్మతల్లి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా సోమవారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 6303408458లో సంప్రదించాలని కోరారు.
నేడు ప్రజావాణి
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
భద్రాచలంలో గిరిజన దర్బార్..
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు.
దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (గత ఎస్డీఎల్సీఈ )లో 2025 – 26లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ టి.గోపి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. జూలై 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 80088 11998 నంబర్లో సంప్రదించాలని కోరారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన