
మొరాయించిన స్పీడ్ బోటు
కిన్నెరసాని జలాశయం మధ్యలో
పర్యాటకుల ఆందోళన
పాల్వంచరూరల్: పర్యాటకులు ఆదివారం జలవిహారం చేస్తుండగా స్పీడ్ బోటు కిన్నెరసాని రిజర్వాయర్ మధ్యలో మొరాయించింది. జలాశయంలో మొసళ్ల సంచారం ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందారు. నెల క్రితమే బోటుకు మరమ్మతులు చేపట్టినా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. డ్రైవర్ మరమ్మతులు నిర్వహించగా తిరిగి స్టార్ట్ కావడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
బోటింగ్ పాయింట్ వద్ద టూరిజం కార్పొరేషన్ మేనేజర్ నిత్యం పర్యాటకుల భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఆదివారం మేనేజర్ విధులకు రాలేదు. స్పీడ్ బోటు జలాశయం మధ్యలో నిలిచిపోవడంతో బోటింగ్ సమస్యపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు. అనంతరం కొందరు ఏజీఎంకు సమస్యను విన్నవించారు. ఈ విషయమై మేనేజర్ దుర్గాప్రసాద్ను వివరణ కోరగా.. అనారోగ్య సమస్యలతో విధులకు రాలేదని తెలిపారు.
ఒక రోజు ఆదాయం రూ. 50 వేలు...
కిన్నెరసానికి పర్యాటకల రాకతో ఆదివారం ఒక్కరోజూ రూ. 50 వేల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 684 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.36,090 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.14,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.