
సర్కార్ వైద్యంపై భరోసా
పాల్వంచ: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యానికి గతంలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వచ్చేవారు. అక్కడి వాతావరణం, అరకొర సిబ్బంది, వైద్యుల పలకరింపు, సిబ్బంది పనితీరు పట్ల కొంత ఆందోళన చెందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంతోపాటు ఆధునిక వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన భార్య శ్రద్ధ పాటిల్ కాన్పు కోసం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, మగబిడ్డ జన్మించాడు. ఆస్పత్రిలో వసతులు మెరుగ్గా ఉన్నాయని కలెక్టర్ కితాబు ఇవ్వడం విశేషం.
పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా..
గతంలో భద్రాచలం పీఓగా, ఖమ్మం కలెక్టర్గా విధులు నిర్వహించిన వీపీ.గౌతమ్ 2018 అక్టోబర్ 28న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. 2020 ఆగస్టు 27న అప్పటి ఎస్పీ సునీల్ దత్ సతీమణి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించారు. ఏఎస్పీ శబరీష్ సతీమణి, ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత కూడా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం పొందారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలో ప్రస్తుత కలెక్టర్ జితేష్ తన సతీమణికి ప్రభుత్వాస్పత్రిలో కాన్పు సేవలు పొందారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు సేవలు
పొందుతున్న ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబీకులు