శక్తి యాప్ను సద్వినియోగించుకోవాలి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్ల టౌన్: మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం శక్తి యాప్ వినియోగం, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే విధంగా శక్తి యాప్ను రూపొందించామని వివరించారు. మొబైల్లో యాప్ను ఇన్న్స్టాల్ చేసుకుని బటన్ నొక్కితే సమీపంలోని పోలీస్ సిబ్బంది వేగంగా స్పందిస్తారని వివరించారు. మహిళల భద్రత కోసం జిల్లాలో ఐదు శక్తి బృందాలు పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ (ట్రిపుల్–పీ) విధానంలో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అత్యవసర సమయంలో 112, గృహహింసల భారినపడితే 181, బాలలు సహాయం కోసం 1098, సైబర్ నేరాలకు 1930, మహిళా భద్రత కోసం 1091 వంటి హెల్ప్లైన్ నంబర్లకు సమాచారం అందించి సహాయం పొందాలని సూచించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన 2,000 మందికిపైగా విద్యార్థినిలు కార్యక్రమంలో పాల్గొని తమ ఫోన్లలో శక్తి యాప్ను డౌనన్ లోడ్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రమౌళి పాల్గొన్నారు.


