
డంపింగ్ యార్డుగా శ్మశాన వాటిక
చీరాలటౌన్: అంత్యక్రియలకు ఉపయోగించే శ్మశానవాటికను డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో సమాధులను చూడాలన్నా.. మృతిచెందిన వారికి దహన సంస్కారాలు చేయాలన్నా వాడరేవు గ్రామస్తులు అల్లాడుతున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను శ్మశానవాటికలో వేస్తూ గ్రామస్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా చెత్తను తగలబెట్టడంతో వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీతోపాటు తీర ప్రాంతంగా పేరొందుతున్న వాడరేవు గ్రామంలోని లైట్ హౌస్వద్ద ఉన్న శ్మశానవాటిక ప్రస్తుతం డంపింగ్ యార్డుగా మారింది. గ్రామం మొత్తంలో 14 వార్డులు, 8436 జనాభా ఉన్న వాడరేవులో మత్య్సకారులు, ఇతర సామాజిక వర్గాల వారు నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే లైట్హౌస్ వద్ద ఉన్న శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేయడంతోపాటు సమాధులను నిర్మించుకుంటారు. అయితే వాడరేవులో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ అక్కడ చెత్తను వేయకుండా గ్రామంలోని వీధుల నుంచి సేకరించిన చెత్త, వ్యర్థాలను ట్రాక్టరు, చెత్త రిక్షాల ద్వారా శ్మశానవాటికలో డంపింగ్ చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీకి ఈ విషయం తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని, కేవలం నాయకుల సేవలో తరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి దూరంగా ప్రభుత్వ స్థలాలను డంపింగ్ యార్డుగా వినియోగించుకోవాలని గతంలో పనిచేసిన పాలవర్గం తీర్మానం చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రత్యేకాధికారుల పాలనలో అయినా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
వాడరేవులో గ్రామంలో ఉన్న శ్మశానవాటికలో చెత్తను డంపింగ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. చెత్త సమస్యను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలో వేరే ప్రాంతానికి డంపింగ్ చేసేలా కృషి చేస్తున్నాం. సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే, చీరాల ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాం. అనుమతులు, నిధులు మంజూరు చేస్తే వేరే ప్రాంతంలో చెత్తను తరలించేందుకు కృషి చేస్తాం.
–కోట నాగయ్య, పంచాయతీ సెక్రటరీ
సమాధులను ముంచెత్తుతున్న చెత్త
పట్టించుకోని అధికారులు