
పీజీఆర్ఎస్ అర్జీలకు సత్వర పరిష్కారం
బాపట్ల: పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్ను కలసి సమస్యలపై వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో 142 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలించాలని, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్య పరిష్కారమైతే అర్జీదారులకు లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని చెప్పారు. తెలుగు భాషలోనే వాటిని జారీ చేయాలని, పరిష్కారమైన వాటిని నిబంధన ప్రకారం ఫొటోలతో అప్లోడ్ చేయాలని తెలిపారు.
విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి
యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ఈనెల 7న క్విజ్, వక్తృత్వం తదితర 15 రకాల పోటీలు నిర్వహించాలని తెలిపారు. 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో కళాశాల విద్యార్థులకు పోటీలు జరపాలని, విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని ఆదేశించారు. క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నెల రోజులు పాటు అవగాహన కార్యక్రమాలు జిల్లాలో ఉంటాయని వెల్లడించారు. అనుమానం ఉన్న వారంతా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అదే క్రమంలో మలేరియా నిర్మూలనపై కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు బాపట్ల జిల్లాలో నమోదు కాలేదని, అయినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్
జె.వెంకట మురళి ఆదేశం