
కార్డుదారులకు సరుకులు సక్రమంగా అందించాలి
చీరాల టౌన్: కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా మండలంలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం, పట్టణంలోని పలు వార్డుల్లోని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి డీలర్ విధిగా ప్రతి నెలా 15వ తేదీలోగా కార్డుదారులకు సరుకులు అందించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచాలని తెలిపారు. ప్రతి డీలర్ విధిగా స్టాక్ రికార్డులు, బోర్డుల్లో సరుకుల కేటాయింపులు, నిల్వలను తెలియజేయాలని చెప్పారు. సరుకుల పంపిణీలో వ్యత్యాసాలు, అధిక ధరలకు అమ్మకాలు, బియ్యాన్ని ఇవ్వకుండా డబ్బులకు కొనుగోలు చేయడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, వీఆర్వోలు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.