
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు
తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు.