
‘యోగాంధ్ర’ లక్ష్యాలను చేరుకోవాలి
బాపట్ల: యోగాంధ్రలో సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై జిల్లా మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమాలు బాపట్ల జిల్లాలో జయప్రదంగా నిర్వహించడానికి ట్రైనర్లకు సమర్థంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. జూన్ 21వ తేదీన మెగా డే నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 6,31,435 మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉండగా ప్రస్తుతం 1,21,213 మంది సభ్యులయ్యారన్నారు. మాస్టర్ ట్రైనర్లకు ఈ నెల 29 నుంచి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయి కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నందున అక్కడకు వెళ్లే వారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ ప్రక్రియను ఈనెల 31వ తేదీన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. డీఆర్డీఏ పి.డి. శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ప్రభాకర్ రావు, డీటీసీ పరంధామరెడ్డి, ఎస్ఎస్ఏ ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కె.పాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల సంరక్షణకు చర్యలు
బాపట్ల: బాలల ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు చట్ట ప్రకారం నడిచేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. సీసీఐఆర్సీ జిల్లా కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. బాలల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 23 బాలల ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రాల లైసెన్సుల పునరుద్ధరణకు సంబంధించిన దస్త్రాలను పునఃపరిశీలన చేయాలన్నారు. ఆ సంస్థల పనితీరుపై క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కమిటీకి నివేదించారు. కమిటీ నివేదికను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనాధలకు ఆశ్రయం కల్పించే సంస్థలలో మౌలిక సదుపాయాలు, కనీస వసతులు, సిబ్బంది పనితీరు, అందిస్తున్న సేవలు, సంబంధిత దస్త్రాలను పరిశీలించిన తదుపరి లైసెన్సులు ఇవ్వాలన్నారు. జువెనల్ జస్టిస్ సంక్షేమ ప్రొబిషన్ అధికారి సౌందర్య, సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ రాధా మాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీసీపీఓ పురుషోత్తమరావు, బాలల సంరక్షణ, సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తడి భూములను సంరక్షించాలి..
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: జల వనరుల సమీపంలోని భూములు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. తడి భూమి సంరక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ తడి భూమి సంరక్షణపై కమిటీలోని అధికారులు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో 601 తడి భూములు ఉన్నాయన్నారు. ఈ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని, భూముల చుట్టూ రసాయనాల వినియోగం నిషేధమన్నారు. ఈ భూములపై సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అటవీశాఖ అధికారి వినోద్ కుమార్, కమిటీలోని సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.