
విజయకీలాద్రిపై సుదర్శన హోమం
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో ఆలయ ఈవో శీనానాయక్ దంపతులతో పాటు 27 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో 183 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ యాగశాలలో కూర్చునేందుకు వీలు లేకపోవడంతో యాగశాల ఆరు బయట కూర్చుని భక్తులు యాగంలో పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.