
ఉమ్మడి గుంటూరు జిల్లాల ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు.
సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ బాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు.
నేడు రైతుల నిరసన దీక్ష
చిలకలూరిపేట: నల్లబర్లీ పాగాకును వెంటనే కొనుగోలు చేయాలని మంగళవారం ఉదయం 10 గంటలకు ఐటీసీ కంపెనీ వద్ద రైతుల నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సమక్షంలో పొగాకు కంపెనీలు అంగీకరించిన విధంగా కొనుగోళ్లు చేయకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. క్వింటా ఒక్కింటికి గత ఏడాది కొన్న రూ.15 వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకు కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలన్నారు. పొగాకు కంపెనీలు న్యాయమైన ధరకు కొనుగోలు చేయకపోతే మార్కెఫెడ్ ద్వారా కొని రైతులను ఆదుకోవాలన్నారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పొగాకు కంపెనీలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్షలో రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.