
నమ్మి చేరదీస్తే.. నగలు దోచేశాడు !
కురబలకోట : తెలిసిన వాడని నమ్మి చేరదీసినందుకు గట్టి బుద్ధి చెప్పాడు ఓ యువకుడు. నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారింటిలోని రూ.10 లక్షలు విలువ చేసే వంద గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదును దోచుకున్న సంఘటన మండల కేంద్రం కురబలకోటలో ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం బాధితురాలి కథనం మేరకు..కురబలకోట ప్రశాంతనగర్లో ఎస్. వరలక్ష్మి (64)అనే వృద్ధురాలు కుమారుడు, మాజీ గ్రామ వలంటీర్ గౌరితో కలసి ఉంటోంది. ఈమెకు ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. చింతకాయ కొట్టడం, కూలిపనులకు వెళ్లడం తదితర కష్టార్జితంతో వంద గ్రాముల దాకా బంగారు నగలు సంపాదించింది. వాటిని ఇంటిలో మంచం కింద ఉన్న లాకర్లో భద్రపరిచింది. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన ఓ యువకుడు వారింటికి వచ్చి వెళ్లేవాడు. ఇతనికి బండి లేదని నెల క్రితం ఇంట్లో ఖాళీగా ఉన్న టీవీఎస్ను కూడా తోలుకోమని ఇచ్చింది. దీంతో అప్పుడప్పుడు అతను వారింటికి బండిలో వచ్చి వృద్ధురాలిని, ఆమె కుమారుడు గౌరిని పలకరించి వెళ్లేవాడు. వృద్ధురాలు కురబలకోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేది. అక్కడి నుంచి అప్పుడప్పుడు ద్విచక్రవాహనంలో ఆమెను ఇంటి వద్ద కూడా దించేవాడు. దీంతో అతను మంచి వాడని నమ్మింది. ఇటీవల ఆమె ఓ పెళ్లికి ఇంట్లోని బంగారు నగలు వేసుకుని వెళ్లింది. అది చూసిన ఆ యువకుడు బంగారు నగలపై కన్నేశాడు. ఇంటి తాళాలు ఎక్కడున్నది తెలిసి ఉండడంతో ఎవరూ లేనప్పుడు ఇంటిలోకి ప్రవేశించి మంచం కింద లాకర్లోని బంగారు నగలను గుర్తించాడు. అనుమానం రాకుండా అలాంటి వాటినే నకిలీ (రోల్డ్గోల్డ్)వి ఉంచి అసలైన బంగారు నగలను కొట్టేశాడు. వృద్ధురాలు కావడంతో గుర్తించలేదని భావించి ఈ పని చేశాడు. ఆమె చింతకాయ కొట్టేది. ఆ డబ్బులు రావడంతో వాటిని లాకర్లో దాయడానికి పర్సు తీసింది. అందులో ముందు దాచిన రూ. 50 వేలు కనిపించలేదు. అంతేకాదు బంగారు నగలు కూడా తేడాగా కన్పించాయి. ఉన్నవి నకిలీవిగా గుర్తించి హతాశురాలైంది. జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న బంగారు నగలు కనిపించకుండా పోవడంతో ఆమె మనసు పగిలిపోయింది. వెంటనే ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి విచారణలో అసలు దొంగ బయటపడ్డాడు. ఇటీవల ఆ యువకుడు జల్సాగా ఖర్చు పెట్టడం, జోరుగా బెట్టింగులు కాయడాన్ని గమనించిన స్థానికులు కూడా ఇతన్ని అనుమానించారు. నమ్మి చేరదీసిన యువకుడే ఈ పని చేసినట్లు వెల్లడైంది. చోరీ చేసిన నగలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను అదే ఊరిలో మరొకరి ఇంట్లో ఇటీవల చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. మేలు చేసిన వారికి కీడు తలపెట్టిన ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బంగారు నగల స్థానంలో
నకిలీవి ఉంచాడు
జల్సాగా ఖర్చు పెడుతుండగా
పట్టుబడిన నిందితుడు

నమ్మి చేరదీస్తే.. నగలు దోచేశాడు !