
ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై ఉన్న గంగోత్రి చెరువులో ఈతకు దిగిన యువకుడు గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. బి.కొత్తకోటకు చెందిన ముగ్గురు మిత్రులు కారులో సాయంత్రం హార్సిలీ హిల్స్ పర్యటనకు వచ్చారు. దారిలో పంప్ హౌస్ వద్ద ఉన్న గంగోత్రి చెరువు వద్ద ఆగారు. వీరిలో బి.కొత్తకోట జయశ్రీ కాలనీకి చెందిన టైలర్ బాలకృష్ణ (29) చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతూ కొంత దూరం వెళ్లాక గల్లంతయ్యాడు. ఇతన్ని కాపాడేందుకు మిగిలిన మిత్రులు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు, సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్, సిబ్బంది చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే చీకటి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో బుధవారం గాలిస్తామని వెనుదిరిగి వెళ్లిపోయారు. గంగోత్రి వద్దకు బాలకృష్ణ కుటుంబీకులు, మిత్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.