
ధరలు ఉన్నా.. దిగుబడి సున్నా
ఎండ మబ్బు తెగులుతో గిటకబారుతున్న నిమ్మకాయలు
రాయచోటి : ధరలు అనుకూలంగా ఉన్నా మండుతున్న ఎండల కారణంగా దిగుబడినిస్తున్న కాయలకు ఎండమబ్బు తెగులు సోకి నిమ్మకాయలు గిటకబారి పోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన అనేక పంటలకు మార్కెట్లో తగిన ధరలు లేక అల్లాడుతున్నారు. పులుసు నిమ్మకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఎండలు అధికం కావడంతో చెట్టుకున్న ఆకులకు ముడత రోగం, చెక్కర తెగుళ్లు బారిన పడ్డాయి. ఎండకు కాచిన కాయలపై మంగు ఏర్పడి కాయలు బండరాయిలా పనికిరాకుండా పోతున్నాయి. మండుతున్న ఎండలకు మనుషులు, జంతువులే కాకుండా చెట్లు సైతం మలమల మాడిపోతున్నాయి. మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్న చెట్లు, కాయలకు సోకుతున్న తెగుళ్ల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నామంటూ నిమ్మ రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. మార్కెట్లో డజన్ నిమ్మకాయలు రూ. 50లు పైబడే పలుకుతున్నాయి. పెరుగుతున్న వేడి, ఉక్కపోత కారణంగా కూల్ డ్రింక్స్ , ఇతర ద్రవ పదార్థాలలో వినియోగానికి నిమ్మకాయలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ధరలు అనుకూలగా ఉండటంతో దిగుబడి వచ్చిన పంటకు తెగుళ్లు సోకకుంటే మంచి ధరలతోపాటు లాభాలు ఉండేవని రైతులు చెబుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులను పిలిపించి సోకిన తెగుళ్లపై పరిశోధనలు చేసి మందులు వాడినా తగిన ఫలితాలు రావడం లేదంటున్నారు. కేవలం ఎండలు అధికంగా ఉండటమే కారణమని చెబుతున్నారు.

ధరలు ఉన్నా.. దిగుబడి సున్నా