
వ్యక్తి అదృశ్యం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని చేనువారిపల్లికి చెందిన దారా మునయ్య అనే వ్యక్తి కనిపించలేదని మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. మండల పరిధిలోని మలకాటపల్లి చీరాల అచ్చమ్మ అనే మహిళ దహన సంస్కారాలకు దారా మునయ్య ఏపీ26సిడి 0027 నెంబరుగల బైక్లో వెళ్లి తిరిగి వస్తుండగా మంటపంపల్లి సమీపంలో ఉదయం 11 గంటలకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాడు. అయితే ఆ తరువాత మునయ్యకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో అతని పెద్ద కుమారుడు డి.కళ్యాణ్తోపాటు బంధువులు తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించడం లేదు. దీం స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికపై అత్యాచారం
– పోక్సో కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో సప్లయర్ షాపు యజమానిపై రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన మైనర్ బాలిక ఓ హోటల్లో పని చేస్తోంది. మైదుకూరు రోడ్డులోని సప్లయర్ షాపు యజమాని సుధాకర్శర్మ తరచూ హోటల్కు టిఫిన్ చేయడానికి వెళ్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి బాలికను పలుమార్లు బయటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సుధాకర్శర్మపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
ఉరి వేసుకుని
యువకుడి ఆత్మహత్య
సింహాద్రిపురం : మండలంలోని కోవరంగుంటపల్లె గ్రామానికి చెందిన ఆశీర్వాదం(19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మట్కా నిర్వాహకులు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంజీవయ్య నగర్లో మట్కా జూదం ఆడుతున్నారని సమాచారం రావడంతో సీఐ సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. రూ. 26,500 నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు.