
అడవిలో మంటలు ఆర్పిన అటవీ సిబ్బంది
సిద్దవటం : కడప రేంజి పరిధిలోని భాకరాపేట బీటులో ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో సోమవారం సాయంత్రం అటవీ సిబ్బంది ఆ ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని కడప రేంజర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కడప ఫారెస్టు రేంజి పరిధిలోని భాకరాపేట బీటు పాలకొండ అటవీ ప్రాంతంలో ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అటవీ సిబ్బంది అప్రమత్తమై ఎగిసి పడుతున్న మంటలను వాటర్ పంపులు, చెట్ల కొమ్మలను ఉపయోగించి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారన్నారు. అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడం వల్ల వన్య ప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్. ఓబులేసు, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎఫ్బీఓలు ఇందిర, రాజశేఖర్రాజు, భాను కిషోర్, ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.