
వడదెబ్బతో వృద్ధుడి మృతి
రాజంపేట : పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో మన్నూరు అరుంధతీవాడకు చెందిన ఎం.రమణయ్య(68) ఆదివారం వడ దెబ్బతో మృతి చెందారు. భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసేవాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఆదర్శ పాఠశాలలో
సీసీ కెమెరాల చోరీ
కలకడ : మండలంలోని గుర్రంకొండ రోడ్డు మార్గం పక్కన ఉన్న కలకడ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దుండగులు చోరీ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మల్లంగ్షావలీ తెలిపారు. వాచ్మెన్ రామాంజులు రాత్రి భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు 2 సీసీ కెమెరాలను చోరీ చేశారన్నారు.
నీరు విడుదల చేసిన మంత్రి
చిన్నమండెం : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఆయన సతీమణి హరితతో కలిసి చిన్నమండెం మండలం బోనమల నాగూరువాండ్లపల్లె, బోనమల దళితవాడకు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. బోనమల గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
కురబలకోటలో చోరీ
కురబలకోట : కురబలకోట జెడ్పీ హైస్కూల్ సమీపంలో కువైట్ మస్తాన్ ఇంటిలో ఆదివారం చోరీ జరిగింది. ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్కు అందిన ఫిర్యాదు మేరకు.. కురబలకోట మస్తాన్ స్థానిక జెడ్పీ హైస్కూల్ సమీపంలో కొత్తగా కట్టిన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అనారోగ్యం కారణంగా తిరుపతి ఆసుపత్రికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో బీరువా చూస్తే బంగారం, కువైట్కు చెందిన కరెన్సీ కన్పించలేదు. దీంతో బాధితుడు అదే రోజు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 600 గ్రాముల బంగారంతో పాటు దుబాయ్కు చెందిన కరెన్సీ పోయినట్లు బాధితుడు తెలిపాడు. చోరీ ఘటనలో తెలిసిన వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని ఎస్ఐ తెలిపారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
జలాశయంలో ఈతకు వెళ్లి వ్యక్తి దుర్మరణం
మైలవరం : వేముల మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (53) అనే వ్యక్తి మైలవరం జలాశయంలో ఈతకు వెళ్లి ఆదివారం సాయంత్రం దుర్మరణం చెందాడు. మైలవరం పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములకు చెందిన షేక్ ఇబ్రహీం జమ్మలమడుగు పట్టణంలో జరిగే హజరత్ సయ్యద్ షా గూడుమస్తాన్ వలీ ఉరుసు ఉత్సవానికి వేముల నుంచి శనివారం గూడెంచెరువు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం మైలవరం మండలంలోని గైబుసా స్వామి కొండకు వెళ్లి అక్కడ చదివింపులు చేసుకుని మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మైలవరం జలాశయానికి వచ్చాడు. జలాశయంలో ఈతకు వెళ్లి అక్కడి మట్టిలో కూరుకుపోయి మృతి చెందాడు.