
నకిలీ సర్టిఫికెట్ల కలకలం
కడప రూరల్: కడపలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4(రాయలసీమ జిల్లాలు) పరిధిలో ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. మొత్తం 150 పోస్టులకు గాను 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆ కార్యాలయ సిబ్బంది పరిశీలించి జాబితా సిద్ధం చేయడానికి పెద్ద కసరత్తే చేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రెండు విడతలుగా పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. ఆ పరంపరలోనే తాజాగా నియామకాలకు శ్రీకారం చుట్టారు.
అనుమానంతో...
వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 11 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో 150 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయాలి. అందులో భాగంగా 200 మందితో అభ్యర్థుల తుది ఎంపిక జాబితా సిద్ధం చేశారు. 200 మందితో జాబితా ఎందుకంటే.. 150 మందిలో కౌన్సెలింగ్కు ఎవరైనా అభ్యర్థులు రాకపోతే, ప్రాధాన్యత ప్రకారం మిగతా వారికి ఆ స్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి ముందస్తుగా ఎక్కువ మందితో జాబితా సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ ప్రకారం అర్హులైన 200 మందితో తుది జాబితా తయారు చేశారు. ఇక ఆ జాబితాను ప్రకటించి నియామక కౌన్సెలింగ్ను చేపట్టడమే. అయితే ఆ శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఎందుకై నా మంచిదని, ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను ధ్రువీకరణ కోసం బోర్డుకు పంపారు. అందులో భాగంగా 100 మంది బీఎస్సీ నర్సింగ్, మరో 100 మంది జీఎన్ఎమ్ నర్సింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ను.. పరిశీలన కోసం పారామెడికల్ బోర్డు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపారు. బీఎస్సీ నర్సింగ్కు సంబంధించి 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపగా, అందులో 20 మంది సర్టిఫికెట్స్ బోగస్గా నిర్ధారించారు. జీఎన్ఎం నర్సింగ్ కోర్సు చేసిన 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ను పారా మెడికల్ బోర్డుకు పంపగా, అక్కడి అధికారుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. అందులో కూడా పెద్ద సంఖ్యలోనే నకిలీ సర్టిఫికెట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
కొందరు ఉద్యోగులు.. ముఠాగా ఏర్పడి..
గతంలో కూడా బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. కొంత మంది ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి బోగస్ సర్టిఫికెట్స్ను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కొందరు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. ఇప్పుడు కూడా వారే ఈ బోగస్ వ్యవహారానికి తెరలేపారనే ప్రచారం ఆ శాఖకు చెందిన ఉద్యోగుల్లో నడుస్తోంది. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకొని కొందరు మోసానికి పాల్పడుతున్నారు. అడ్డంగా దోచుకుంటున్నారు. ‘అధికారం మాదే’ అనే మదంతో కొంత మంది ఒక్కో పనికి లెక్కకట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం.
వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో చేపడుతున్న కాంట్రాక్టు స్టాఫ్నర్స్ నియామకాల్లో.. నకిలీ సర్టిఫికెట్స్ వెలుగు చూడటం కలకలం రేపుతోంది. కొంత మంది అన్ని వ్యవహారాల్లో ఆరితేరి..
అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించు
కోవడానికి ఒక ముఠాగా ఏర్పడి.. వీటిని తయారు చేస్తున్నట్లు వినికిడి. దీంతో
అప్రమత్తమైన ఆ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో.. ఈ వ్యవహారం బయటపడింది.
స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీలో వెలుగులోకి..
ధ్రువీకరించిన హెల్త్ యూనివర్సిటీ
కొందరి హస్తలాఘవంతో తయారీ
వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం అప్రమత్తం
అవును.. నిజమే..!
బోగస్ సర్టిఫికెట్స్ వెలుగు చూసిన మాట వాస్తవమే. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నియామకాలు చేపట్టక ముందే.. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన కోసం బోర్డుకు పంపాం. అక్కడ బోగస్ సర్టిఫికెట్స్ అని తేలాయి. ఇంకా నిర్ధారణ కావాల్సిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ వివరాలు రాగానే చట్టపరమైన చర్యలు చేపడుతాం. అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరకముందే.. సర్టిఫికెట్స్ పరిశీలన చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ చర్యలు చేపట్టాం.
– డాక్టర్ రామగిడ్డయ్య, రీజినల్ డైరెక్టర్,
వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం

నకిలీ సర్టిఫికెట్ల కలకలం