తాడేపల్లి : మార్గదర్శి బాధితులకు న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈనాడు కిరణ్కు చెంపపెట్టులాంటిదన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. మార్గదర్శి బాదితులకు న్యాయం జరగాలని సుప్రీం ఇచ్చిన తీర్పు అద్భుతమైనదన్నారు. రామోజీరావు చనిపోయినందున కేసు కొట్టేయాలంటూ కిరణ్ కోర్టును అడగటం సిగ్గుచేటన్నారు.
‘రూ.600 కోట్లు ప్రజల నుండి అక్రమంగా డిపాజిట్టు తీసుకున్నారు. ఆ డబ్బంతా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ లాంటి వాడినే మానసికంగా చంపేశారు. మద్యపాన నిషేధాన్ని తనకు అవసరమైనట్టుగా వాడుకున్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలనే బెదిరించారు. మార్గదర్శి ద్వారా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో ఇష్టానుసారం చేశారు.
తనకు నచ్చని నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. అలాంటి కిరణ్కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలకు బలం చేకూరింది. ఆర్బిఐతో సహా రెండు తెలుగు రాష్ట్రాల వివరణ కోరటం అభినందనీయం. మార్గదర్శి బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.


