విశాఖలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు
మహిళలపై దాడులకు పురిగొల్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్గా అనర్హుడు
తక్షణం పదవికి రాజీనామా చేయాల్సిందే
మహిళలను గౌరవించడం హిందూ సంప్రదాయం
చేష్టలుడిగి చూస్తున్న చంద్రబాబూ దోషే
బాబు దుశ్శాసన పాలనకు ఘోర పరాభవం తప్పదు.. అసమర్థ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ శ్రేణులు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హైందవ ద్రోహులని వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం నిప్పులు చెరిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కారు. తిరుపతిలో బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలపై పచ్చ గూండాలు దాడులకు పాల్పడడంపై మండిపడ్డారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు చేత పట్టుకొని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు.
పలు చోట్ల రోడ్లపై బైఠాయించి బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ద్వయంపై ధ్వజమెత్తారు. అసమర్థ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పలు చోట్ల పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును చంద్రబాబు సర్కారు అణచివేస్తోందని మండిపడ్డారు. మహిళలను గౌరవించడం హైందవ సంప్రదాయమని, అబలలపై దాడులకు పాల్పడడం అత్యంత పాశవికమని దుయ్యబట్టారు. స్త్రీమూర్తులపై దారుణాలకు ఒడిగట్టేవారు హైందవ ద్రోహులేనని, వారు తక్షణం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలపైనే దాడులు చేసి, వారిపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్న ఈ నిరంకుశ సర్కారుకు పతనం తప్పదని హెచ్చరించారు. మహిళామూర్తులను బాధించిన ఏ పాలకుడూ బతికిబట్టకట్టినట్టు చరిత్రలో లేదని ఆక్రోశించారు. బాబు దుశ్శాసన పాలనకు ఘోర పరాభవం తప్పదని దుయ్యబట్టారు. మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
» ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ దుష్ట సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
» నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నల్ల కండువాలతో వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బాబు దుశ్శాసన పాలనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

» ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు.
» ఏలూరులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా చేశారు.
» పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

» తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి.
» డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. బుద్ధ విహార్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి రోడ్డుపై బైఠాయించారు.
» కాకినాడ ఇంద్రపాలెం వంతెన సమీపాన అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు.
» విజయనగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేశారు. బాబు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
» పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
» శ్రీకాకుళంలోనూ పార్టీ శ్రేణులు నిరసన గళమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు.
» విశాఖపట్నం ఎల్ఐసీ జంక్షన్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు.
» అనకాపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మానవహారం నిర్మించారు.

» అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు కదంతొక్కారు. నిరసన ప్రదర్శనలు చేశారు.

» ఉమ్మడి తిరుపతి జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. ధర్నాలు చేశారు.అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు.

» కర్నూలు, నంద్యాలలోనూ వైఎస్సార్సీపీ నేతలు బాబు సర్కారు హిందూ వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు.


