సాహసం.. ఆ సేతు హిమాచలం

Visakhapatnam To Kashmir Road Trip by Bike  - Sakshi

(విశాఖపట్నం) చరిత్రలో మనకంటూ ఓ పేజీ ఉండాలి. నాలుగు గోడల మధ్య గొంగళి పురుగులా బతకడం కంటే సీతాకోకచిలుకలా మారి ప్రపంచాన్ని చుట్టేయాలి. కళ్లకు గంతలు విప్పేయాలి. హాయిగా.. ఆనందంగా ప్రపంచంతో కబుర్లాడేయాలి. చేసే ప్రయాణం లో సామాజిక బాధ్యత ఉండాలి. ఇదే ఆలోచన 20 ఏళ్ల యువకుడికి వచ్చింది. మనసులో ‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం’ అనే సాంగ్‌ మోగింది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నాడు. తన 125 సీసీ బైక్‌పై విశాఖ నుంచి కశ్మీర్‌ , కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి విశాఖకు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రోజుకు 500 నుంచి 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. 55 రోజుల్లో 11,600 కిలోమీటర్ల బైక్‌ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు.     

ఇరవై ఏళ్ల బొంతు సంపత్‌ బైక్‌పై దేశాన్ని చుట్టివచ్చాడు. లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ట్రావెల్‌ అంట్‌ టూరిజంలో బీఏ సెకండియర్‌ చదువుతున్నాడు. సంపత్‌ పర్యావరణ పరిరక్షణ కోసం ‘సేవ్‌ సాయిల్‌’పేరుతో బైక్‌పై సాహసయాత్ర చేపట్టి అందరి మన్ననలు, అభినందనలు అందుకున్నాడు. చైనా, పాకిస్థాన్‌ బోర్డర్‌ల మీదుగా సాగిన ఈ యాత్రలో ఎన్నో ఆహ్లాదకరమైన, ఆనందమైన క్షణాలను అనుభవించాడు. చిన్న చిన్న ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. మొత్తంగా ఈ యాత్ర తనలో గొప్ప ఆత్మవిశ్వాసం, సంతృప్తినిచ్చిందని, త్వరలో టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై నేపాల్‌ యాత్ర చేపడతానని చెప్పాడు. ఈ యాత్ర అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..  

ఆనందం.. అయోమయం 
యాత్రలో చాలా వరకు ఇంగ్లీష్, వచ్చి రాని హిందీతో మేనేజ్‌ చేసేవాడిని. కశ్మీర్ బోర్డర్‌ నుంచి అసలు సమస్య మొదలైంది. వారు మాట్లాటే కశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతంలో మాట్లాడే లద్దాఖీ భాష రాక.. మన భాష వారికి అర్థం కాక ఇబ్బందిపడ్డాను. రోజూ హైవే పక్కన డాబాల్లో భోజనం చేసేవాడిని. జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, లద్దాఖ్‌ రీజియన్‌లో టిబెటన్‌ సంప్రదాయ వంటలే దొరికేవి. అవి తినలేక వారం రోజుల పాటు మ్యాగీ తిని సరిపెట్టుకున్నా. కశ్మీర్‌ బోర్డర్‌లో మన సిమ్‌ పని చేయలేదు. అక్కడ లోకల్‌ సిమ్‌ తీసుకున్నా. అయినప్పటికీ లూసర్, స్పిటీవేలీ తదితర ప్రాంతాల్లో ఆ సిమ్‌ పని చేయలేదు. మూడు రోజుల పాటు కుటుంబసభ్యులతో మాట్లాడలేకపోయా. లద్దాఖ్‌లో అనుమతుల కోసం ఏడు రోజులు నిరీక్షించాను. వాతావరణం బాగోక, వర్షాల కారణంగా మొత్తం యాత్రలో 15 రోజులు రెస్ట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ దాటాక బాగా చలి వేసింది. కశ్మీర్, హిమాచలప్రదేశ్, లద్దాఖ్‌ ప్రాంతాల్లో –6 డిగ్రీల చలిలో ప్రయాణించేటపుడు బాగా ఇబ్బంది పడ్డా. కాళ్లు, చేతులు తిమ్మిరెక్కిపోయేవి. గేర్‌ వేస్తున్నా స్పర్మ ఉండేది కాదు. హ్యాండిల్‌ పట్టుకోలేక పోయేవాడిని. అయినా మొండిగా ప్రయాణం కొనసాగించాను. బైక్‌ ఏపీ రిజిస్ట్రేషన్ చూసి చాలా మంది టూరిస్టులు, రైడర్స్‌ పలకరించేవారు. ఎటువైపు వెళ్లాలో సలహాలిచ్చేవారు. ఆ క్షణంలో మనోళ్లు కనిపించారన్న ఆనందం కలిగేది.  

యాత్ర సాగిందిలా..  
విశాఖలో మొదలై తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ మీదుగా జమ్మూకశ్మీర్‌ చేరుకున్నా. తిరిగి అక్కడ నుంచి లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుని అక్కడ నుంచి విశాఖకు చేరుకున్నా. మొత్తంగా 14 రాష్ట్రాలను చుట్టి.. తన యాత్రను పూర్తి చేశానని సంపత్‌ తెలిపాడు.  

గరిష్టంగా 850 కి.మీ. ప్రయాణం 
రోజూ ఉదయం 8 గంటలకు బైక్‌పై యాత్ర ప్రారంభం అయ్యేది. ప్రారంభంలో సేవ్‌ సాయిల్‌పై అవగాహన కల్పించేవాడిని. భోజన విరామం తీసుకుని రాత్రి 11 గంటల వరకు బైక్‌పై ప్రయాణం చేసేవాడిని. రోజుకు 500 నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగేది. అత్యధికంగా ఒక్క రోజులో 850 కిలోమీటర్లు దూరం కూడా ప్రయాణం సాగించా.. రోజూ 12 నుంచి 14 గంటల సేపు బైక్‌పై ప్రయాణించి అలసిపోయేవాడిని. ఈ ప్రయాణంలో ఎక్కడ హోటల్‌ అందుబాటులో ఉండే.. అక్కడే రాత్రి బస చేసేవాడిని. తన హెల్మెట్‌కు అమర్చిన మైక్, కెమెరా ద్వారా నా రైడ్‌ను వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశా.  

సామాజిక బాధ్యతగా..  
సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సంపత్‌ మొదటి నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతగా ఏదైనా చేయాలన్న తపన ఉండేది. ఆరిలోవకు చెందిన సంపత్‌ తండ్రి బొంతు శ్రీనివాసరావు పరవాడలో చిన్న రెస్టారెంట్‌ నడుపుతున్నారు. తల్లి ఓమ్న గృహిణి. తమ్ముడు ఇంటర్‌ చదువుతున్నాడు. బుల్లయ్య కళాశాలలో ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులో బీఏ జాయిన్‌ అయ్యాక తన సబ్జెక్ట్‌ పరంగా ట్రావెలింగ్‌ చేయాలన్న ఆలోచన వచ్చింది. గతేడాది ‘నో ప్లాస్టిక్‌’నినాదంతో అవగాహన కలి్పస్తూ సైకిల్‌పై విశాఖ నుంచి కన్యాకుమారి వరకు 23 రోజుల్లో 1,857 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఏడాది మే 30న తన హోండా షైన్‌ 125 సీసీ బైక్‌పై బుల్లయ్య కళాశాల వద్ద బయలుదేరి కశ్మీర్ చేరుకుని, అక్కడ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాడు. కన్యాకుమారి నుంచి మరలా ఈ నెల 23న నగరానికి చేరుకున్నాడు.

చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రయాణం 
ఇండియాకు చైనాకు కనెక్టింగ్‌ రోడ్‌ లద్దాఖ్‌లో ప్రయాణం కొత్త అనుభూతిని కలిగించింది. చైనా బోర్డర్‌లో ప్రయాణం కొనసాగించా. తిరుగు ప్రయాణంలో భారత్‌–పాకిస్తాన్‌ బోర్డర్‌లో వాఘా వద్ద సైనిక వందనం చూశాను. చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. 55 రోజుల ప్రయాణానికి రూ.1.60 లక్షలు ఖర్చు అయింది. కేవలం పెట్రోల్‌కే రూ.40 వేల వరకు ఖర్చు చేశా. ఆ తర్వాత రాత్రి పూట బస చేయడానికి హోటల్‌ రూమ్స్‌కు ఎక్కువ చెల్లించా. లద్దాఖ్‌లో ఉన్న ఒక్క రూమ్‌ కోసం ఆ రాత్రి రూ. 5500 ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ యాత్రకు బుల్లయ్య కళాశాల యాజమాన్యం రూ.22 వేల వరకు సాయం అందించింది. ధాన్‌ ఫౌండేషన్‌ రూ.60 వేల సాయం అందించి నన్ను ప్రోత్సహించింది. వారి సహాయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా..  

ప్రపంచంలో ఎత్తైన ఉమ్లింగ్‌ లా.. 
సముద్రమట్టానికి 19,042 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్‌ లా పాస్‌కు 125 సీసీ బైక్‌పై చేరుకోవడం చాలా గొప్ప విషయం. 400 సీసీ బైక్‌పై ప్రయాణించలేని మార్గంలో 125 సీసీ బైక్‌పై ప్రయాణించా. ఉమ్లింగ్‌ లా పాస్‌కు చేరాక ఊపిరి ఆడక ముఖమంతా పచ్చగా మారిపోయింది. సమీపంలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి సాయం అందించారు.  

కొత్త అనుభూతి కలిగింది 
నేను ఈ ప్రయాణంలో జీవితంలో మొదటిసారి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాలు, అరుదైన ప్రాంతాలను చూడగలిగాను. ఆగ్రా, నూబ్రా వేలీ, ప్రపంచంలో ఎత్తైన చిచామ్‌ బ్రిడ్జి, ప్రపంచంలో ఎత్తైన పెట్రోల్‌ బంకు ఖాజా బంకు, హిక్కింలో ఎత్తైన పోస్టాఫీస్, సిమ్లా, మనాలీ, ఇండియా పాక్‌ బోర్డర్, ఇండియా చైనా బోర్డర్, జోజి లా పాస్, కన్యాకుమారి, కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పాంగాంగ్‌ లేక్, డిస్కిట్, సోన్‌మార్గ్, ప్రపంచంలో ఎత్తైన రోడ్‌ ఖార్‌దుంగ్లా, ఉమ్లింగ్‌ లా పాస్‌ రహదారుల్లో ప్రయాణం, లాంగెస్ట్‌ అటల్‌ టన్నెల్‌లో ప్రయాణం, అందమైన ప్రకృతి, ఆహ్లాదమైన మంచు, లోయలు, జలపాతాలను చూస్తూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్‌లో బైక్‌ ప్రయాణం జీవితంలో మర్చిపోలేనని సంపత్‌ తన యాత్ర విశేషాలను వివరించాడు.    

60 కిలోమీటర్లు.. 8.30 గంటలు  
కార్గిల్‌ నుంచి లేహ్‌ వెళ్తున్న సమయంలో రోడ్‌ బాగోక బైక్‌ స్కిడ్‌ అయి పడిపోయా. అటుగా వెళ్తున్న రైడర్ల సాయంతో బైక్‌ సరిచేసుకుని ముందుకు సాగా. అలాగే మనాలి నుంచి లూసర్‌ వరకు 60 కిలోమీటర్ల జర్నీ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డా. ఈ మార్గం నేషనల్‌ హైవే అయినప్పటికీ రహదారి అంతా పెద్ద పెద్ద రాళ్లతో ఉంది. బైక్‌పై వెళ్లడానికి నానా పాట్లు పడ్డా. 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పట్టింది. రాళ్లపై ప్రయాణంతో ఆ రోజు బాగా అలసిపోయా..   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top